ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో మూఢనమ్మకాల సీజన్ నడుస్తుంది. ఇది అనామకులు, చదువుకొని వారి వల్ల అనుకుంటే తప్పు. ఇది కేవలం మనల్ని పాలించే రాజకీయ నాయకుల వల్లే. దీనిని మొదటిగా అధికార పార్టీ మొదలు పెట్టింది. గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ లో వరుణుడు విజృంభిస్తున్నాడు. కొన్ని చోట్ల ఏకంగా చెరువులను చేలను ఏకం చేస్తున్నాడు.
లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో కొందరు కొంప గోడు కూడా లేకుండా నిలువ నీడ, తినడానికి తిండి లేకుండా అలమటిస్తున్నారు. అయితే వర్షాలు కురవడం మా ప్రభుత్వం వల్లే అని, చంద్రబాబు ఉంటే వర్షాలు ఉండవని, కరువు విలయతాండవం చేస్తుందని అధికార పార్టీ నేతలు చెప్పుకొస్తున్నారు.
మరి లోతట్టు ప్రాంతాలలోని ప్రజల సమస్యలకు బాధ్యత కూడా మాదే అంటారో లేదో తెలీదు. మరోవైపు… ఈ రోజు శ్రీశైలం ఎడమగట్టు కాల్వ జల విద్యుత్ కేంద్రంలో పెద్ద అగ్ని ప్రమాదం జరిగింది. అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న వారిని రక్షించడానికి ప్రయత్నాలు సాగుతున్నాయి. కాని లోపల దట్టమైన పొగ ఉండడంతో రక్షణ చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఈరోజు అక్కడకు వెళ్లాల్సి ఉంది. ఈ ప్రమాదం కారణంగా జగన్ తన పర్యటనను రద్దు చేసుకున్నారు. ఈ అవకాశాన్ని ప్రధాన ప్రతిపక్ష పార్టీ, తెలుగుదేశం ఉపయోగించుకుంటుంది. జగన్ పాద మహిమ వల్లే వరుస ప్రమాదాలని ఆ పార్టీ చెప్పుకొస్తుంది. అయితే ఇటువంటి మూఢ నమ్మకాల రాజకీయాల వల్ల ఎవరికీ ఉపయోగం అనేది ఇరు వైపుల వారు ఆలోచించుకుంటే వారికీ, ప్రజలకు కూడా మంచిది.



