ఏటా దావోస్లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు తెలంగాణ మాజీ ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తప్పకుండా వెళ్ళి రాష్ట్రానికి వేలకోట్ల పెట్టుబడులు, పరిశ్రమలు, ఐటి కంపెనీలు సాధించుకొచ్చేవారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈసారి సిఎం రేవంత్ రెడ్డి, ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, ఉన్నతాధికారుల బృందంతో దావోస్ సదస్సులో పాల్గొనేందుకు జనవరి 15న బయలుదేరుతున్నారు.
రేవంత్ బృందం మూడు రోజులపాటు వివిద దేశాల నుంచి వచ్చిన సదస్సుకి వచ్చే పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులతో సమావేశమవుతారు. రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలు, ఐటి కంపెనీలు సాధించేందుకు ప్రయత్నిస్తారు. మళ్ళీ జనవరి 18న వారు హైదరాబాద్ తిరిగి వస్తారు.
రేవంత్ బృందం తొలి ప్రయత్నంలో పరిశ్రమలు, పెట్టుబడులు ఆకర్షిస్తే మంచిదే. ఒకవేళ ఆకర్షించలేకపోయినా ‘తెలంగాణలో ప్రభుత్వం మారిందే తప్ప పరిశ్రమలు, పెట్టుబడుల విషయంలో అదే స్పూర్తి కొనసాగిస్తామని’ తెలియజేసిన్నట్లవుతుంది. కనుక రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న పరిశ్రమలు, ఐటి కంపెనీలకు, తెలంగాణకు రావాలనుకొంటున్న వారికి కూడా రేవంత్ ప్రభుత్వం ఈ పర్యటనతో ఓ మంచి సందేశం ఇచ్చిన్నట్లవుతుంది.
రేవంత్ రెడ్డి సిఎంగా బాధ్యతలు చేపట్టిన నెల రోజులకే తెలంగాణకు పెట్టుబడులు, పరిశ్రమలు, ఐటి కంపెనీలు సాధించేందుకు దావోస్ బయలుదేరుతున్నారు. మరి నాలుగున్నరేళ్ళుగా ఏపీ సిఎంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఈసారైనా దావోస్ వెళతారా? అనే సందేహం కలగడం సహజమే.
ఎందుకంటే ఆయన తాడేపల్లి ప్యాలస్ నుంచి కాలు బయటపెట్టకుండానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకంగా రూ.13.56 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించారు కదా… అందుకని! కనుక మళ్ళీ మరోసారి విశాఖలో గ్లోబల్ ఇన్వస్టర్స్ సమ్మిట్ నిర్వహిస్తే రాష్ట్రానికి మరో రూ.13-15 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేస్తాయి కదా? అదీగాక ఒకవేళ జగన్ ప్రత్యేక విమానం వేసుకొని లండన్ మీదుగా దావోస్ పర్యటనకు బయలుదేరినా టిడిపి నేతలు అసూయ పడతారు కూడా. కనుక తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి దావోస్ బయలుదేరుతున్నారని మనమూ పోటీగా బయలుదేరాల్సిన అవసరం కనిపించడం లేదు.
ఒకవేళ దానిలో పాల్గొనడం అవసరమని భావిస్తున్నా ప్రస్తుతం జగన్ ఎమ్మెల్యేలు, నియోజకవర్గం ఇన్చార్జిలను మార్చే పనిలో బిజీగా ఉన్నందున మంత్రులు గుడివాడ అమర్నాథ్, అంబటి రాంబాబు, రోజా, ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్యే కొడాలి నానిలను పంపించినా సరిపోతుంది. వారు సదస్సులో పాల్గొని ఆంధ్రప్రదేశ్ గురించి, తమ పరిపాలన గురించి చక్కగా వివరించగల సమర్ధులే!




