2024 టీడీపీ జనసేన ఎన్నికల వ్యూహంతో వైసీపీ లెక్కలు తారుమారయ్యాయి. “ఒక్క పొత్తు రెండు సామజిక వర్గాలు” అన్న పంథాలో ముందుకెళ్లిన బాబు, పవన్ అనుకున్న లక్ష్యాన్ని సునాయాసంగా అందుకుని వైసీపీ రెక్కలు విరిచారు.
ఏపీ రాజకీయాలను మలుపు తిప్పగలిగిన సామర్థ్యం, ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయగలిగిన స్థాయి కాపు సామజిక వర్గంలో ఉండడంతో ఈసారి వైసీపీ లెక్క తప్పింది. ఈ కాపు సామాజిక వర్గాన్ని పవన్ కు దూరం చేసి, బాబు కి శత్రువును చేసి తన పార్టీకి అండగా నిలుపుకోవడానికి తన పార్టీ లోని కాపు నేతలను బలిపీఠం ఎక్కించారు జగన్.
అందుకోసం ఆ సామజిక వర్గానికి చెందిన ముఖ్యనేతలను చేరదీసి పవన్ మీదకు ఉసిగొల్పారు. అందులో ముఖ్యంగా ముద్రగడ ను ప్రత్యక్షంగా ఉపయోగించుకున్న జగన్ హరిరామ జోగయ్యను పరోక్షంగా వాడుకొన్నారు. అలాగే తన పార్టీలో ఉన్న పేర్నినాని, అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాధ్, గ్రంధి శ్రీనివాస్, ఆళ్ళ నాని, దాడిశెట్టి రాజా, జక్కం పూడి రాజా వంటి కాపు నేతలతో పవన్ పై వ్యక్తిగత దాడికి సైతం పురికొల్పారు.
రంగా హత్యకు టీడీపీ కారణమంటూ ఆరోపణలు చేస్తూ అటువంటి కాపు నేతను దారుణంగా హత్య చేసిన పార్టీకి పవన్ మద్దతు ఇస్తున్నారు. కాపు జాతిని కమ్మ వారి కాళ్ళ దగ్గర తాకట్టు పెడుతున్నారు అంటూ కాపు సామజిక వర్గాన్ని ఎంతలా రెచ్చకొట్టినా, కమ్మ సామజిక వర్గాన్ని ఎంతలా దూషించిన కాపు, కమ్మ ల మధ్య రాజకీయ వైరాన్ని సృష్టించి తన పదవి నిలబెట్టుకోవాలని చూసిన జగన్ లెక్క సరిచేసాయి ఈ రెండు సామాజిక వర్గాలు.
ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవను రెండు సామజిక వర్గాలకు ఆపాదించి రెండు పార్టీల కార్యకర్తలను కలవకుండా చేయడానికి జగన్ వేసిన ఏ వ్యూహం ఫలించలేదు సరికదా అది తన పార్టీకే తిప్పి కొట్టింది. వైసీపీ పార్టీ నుండి జగన్ మద్దతుతో పోటీలో నిలబడిన వైసీపీ కాపునేతలందరు టీడీపీ, జనసేన దెబ్బకు ఐదేళ్లు రాజకీయ అజ్ఞాతంలోకి వెళ్లాల్సి వచ్చింది.
అధికారంలో ఉన్న ఐదేళ్లు వైసీపీ కాపు నేతలు చేసిన ఓవర్ యాక్షన్ కు తమ ఓటుతో సరైన గుణపాఠం చెప్పారు ఓటర్లు. కొన్ని దశబ్దాల రాజకీయ అనుభవం, కాపు సామజిక వర్గ నేతగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ముద్రగడ జగన్ పంచన చేరగానే సొంత కుమార్తె నుండే వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. అలాగే ఎన్నికల తరువాత ముద్రగడ తన పేరు రెడ్డిగా మార్చుకునే స్థాయికి కూడా రాజకీయ లెక్కలు మారాయి.
వైసీపీ వ్యతిరేక ఓటు చిలనివ్వను అంటూ పవన్ వేసిన లెక్కలతో వైసీపీ రెక్కలు విరిగాయి. కొన్ని దశబ్దాలుగా రెండు సామజిక వర్గాల మధ్య ఉన్న వైషమ్యాలను, అపోహలను బాబు, పవన్ లు ఏకకాలంలో పటాపంచలు చేసి ఏపీ భవిష్యత్ రాజకీయాలలో అనూహ్య మార్పులు తీసుకు వచ్చారు.
టీడీపీ, జనసేన బంధం మరో ఎన్నికల వరకు కొనసాగితే ఏపీలో వైసీపీ పార్టీకి అధికారం అందని ద్రాక్షగానే మిగులుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎన్నికల ముందే కాదు ఫలితాల తరువాత కూడా ఈ రెండు పార్టీలు ఒకరితో ఒకరు కలిసి నడుస్తున్నారు అని రెండు పార్టీల శ్రేణులకు వారి చర్యలు ద్వారా రుజువుచేస్తునే ఉన్నారు.
అసెంబ్లీ సాక్షిగా పవన్, బాబుల బంధం మరోసారి రాష్ట్ర ప్రజల ముందు బయటపడింది. అలాగే జనసేన అధినేత పవన్ ఆకాంక్ష మేరకు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పెట్టే ఉచిత ఆహార పథకానికి విద్యాశాఖ మంత్రి లోకేష్ డొక్కా సీతమ్మ పేరును ప్రకటించారు. దీనితో పవన్ ఆశయ సాధనకు, జనసేన సిద్ధాంతానికి టీడీపీ కట్టుబడి ఉందని మరోసారి నిరూపించారు లోకేష్.
లోకేష్ చేసిన ఈ పనికి అభినందిస్తూ పవన్ తన సోషల్ మీడియాలో మంత్రి లోకేష్ కు కృతజ్ఞతలు తెలియచేసారు. ఇలా ఒకరు పట్ల ఒకరు గౌరవంతో, ఒక పార్టీ సిద్ధాంతానికి మరో పార్టీ కట్టుబడిన తీరుతో ఈ ఐదేళ్లు కళ్ళుమూసుకుంటే వచ్చేది మన ప్రభుత్వమే అంటూ జగన్ వేస్తున్న లెక్కలు మారి వైసీపీ రెక్కలు విరగడం ఖాయంగా కనపడుతుంది.




