మూడేళ్ళ పాలనలో చిత్రవిచిత్రమైన నిర్ణయాలు తీసుకొంటూ అన్ని రంగాలను భ్రష్టు పట్టించేస్తూ, మా అంత ఉత్తమమైన ప్రభుత్వం, ఉత్తమ పాలన ఈ దేశంలోనే లేదని గొప్పలు చెప్పుకోవడం వైసీపీ ప్రభుత్వానికే చెల్లు. అయితే ప్రజల కళ్ళకు గంతలు కట్టే ప్రయత్నంలో వైసీపీ ప్రభుత్వమే కట్టుకొని తాను భ్రమలో ఉంటూ ప్రజలను కూడా భ్రమింపజేయాలని ప్రయత్నిస్తోంది. ఎల్లో కలర్ కళ్ళద్దాలు ధరించి లోకమంతా ఎల్లోగా ఎందుకు కనిపిస్తోందని ప్రశ్నిస్తోంది.
కానీ అకారణంగా ఎవరైనా తమను, తమ ప్రభుత్వాన్ని ఎందుకు నిందిస్తారు? అని ఆలోచించకుండా రాష్ట్రంలో మీడియా అంతా ఏకమై తమ ప్రభుత్వాన్ని విమర్శిస్తోందని సిఎం జగన్మోహన్ రెడ్డి ఈరోజు శాసనసభలో ఆరోపించారు. తమ ప్రభుత్వం చేస్తున్న మంచిపనులను చూసి ప్రతిపక్ష టిడిపి ఓర్చుకోలేకపోవడం సహజమే కానీ మీడియా కూడా కళ్ళలో నిప్పులుపోసుకొంటోందని సిఎం జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర ప్రజలందరికీ మేలు చేయాలనే ఉద్దేశ్యంతోనే తాను మూడు రాజధానుల ప్రతిపాదన చేస్తే దానినీ మీడియా తప్పు పడుతూ తమ ప్రభుత్వంపై ఏడుస్తోందని సిఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు.
బల్క్ డ్రగ్ పార్కు కోసం తెలంగాణతో సహా 17 రాష్ట్రాలు పోటీ పడితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దక్కడమే రాష్ట్రాభివృద్ధికి నిదర్శనమని అన్నారు. ఇప్పటికే ఆ రంగంలో 30 వేలమందికి ఉద్యోగాలు ఇచ్చామని రాబోయే రోజుల్లో మరో 40 వేలమందికి ఉద్యోగాలు లభించబోతున్నాయని సిఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు.
టిడిపి హయాంలో నిర్వీర్యమైన పారిశ్రామిక రంగాన్ని తన ప్రభుత్వం పునరుద్దరించిందని అన్నారు. టిడిపి హయాంలో రాష్ట్రానికి సగటున రూ.11,994 కోట్లు పెట్టుబడులు వస్తే తన ప్రభుత్వ హయాంలో సగటున రూ.12,702 కోట్లు పెట్టుబడులు వచ్చాయని చెప్పారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి, పారిశ్రామిక ప్రగతిపై తాను సాక్షాధారాలతో చూపినా మీడియా తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దుష్ప్రచారం చేస్తోందని సిఎం జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు.
ఒకవేళ వైసీపీ ప్రభుత్వ హయాంలో నిజంగా ఇంత అభివృద్ధి జరిగిపోతుంటే, రాష్ట్రంలో అన్ని రంగాలు దివ్యంగా ఉంటే, లక్షలాదిమంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎందుకు ఆందోళనలు చేస్తున్నారు? ? రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు నెలనెలా టంచనుగా ఎందుకు జీతాలు చెల్లించలేకపోతోంది. కార్పొరేషన్లను అడ్డుపెట్టుకొని అప్పులు ఎందుకు చేయవలసి వస్తోంది? పంచాయతీల నిధులు ఎందుకు పక్కదారి పట్టిస్తున్నట్లు?ఆంధ్రాలోని యువత నేటికీ ఉద్యోగాల కోసం హైదరాబాద్ లేదా బెంగళూరు నగరాలకు ఎందుకు వలసలు వెళ్ళవలసి వస్తోందిసామాన్య ప్రజలకు, మీడియాకు ఇన్ని సమస్యలు కనిపిస్తున్నాయి గాబట్టే అందరూ వైసీపీ ప్రభుత్వాన్ని తప్పు పడుతున్నారు. ఎవరో ఒకరో ఇద్దరో తప్పు పట్టారంటే అది రాజకీయ దురుదేశ్యం అని కొట్టిపడేయవచ్చు. రాష్ట్రంలో లక్షలాదిమంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు, దాదాపు మీడియా అంతా కూడా వేలెత్తి చూపుతుంటే తప్పు గ్రహించి సరిదిద్దుకోకుండా అందరూ మమ్మల్నే వేలెత్తి చూపిస్తున్నారని బాధపడటంలో అర్దం లేదు.



