ఆన్లైన్లో పాఠాలు, చదువులు కొత్త విషయం కానప్పటికీ, ఆ అవసరం లేనప్పుడు వాటి కోసం ప్రాకులాడటం, దాని కోసం ప్రభుత్వం రూ.1,466 కోట్లు ఖర్చు పెట్టడం ప్రజాధనాన్ని వృధా చేయడమే అవుతుంది. సిఎం జగన్ పుట్టిన రోజు సందర్భంగా రాష్ట్రంలో 8వ తరగతి విద్యార్థులందరికీ రూ.668 కోట్లు ఖర్చు చేసి 5,18,740 ట్యాబ్లు అందజేసారు. వాటిలో రూ.778 కోట్లు విలువగల బైజూస్ కంటెంట్ (పాఠాలు) ఉన్నాయని చెప్పారు. దాంతో కలిపి రాష్ట్ర ప్రభుత్వం మొత్తం రూ.1,466 కోట్లు ఖర్చు చేసినట్లు ప్రకటనలలో పేర్కొన్నారు. నిరుపేద విద్యార్థులకి కూడా ఉన్నత వర్గాల పిల్లలతో సమానంగా అత్యుత్తమ విద్యావకాశాలు కల్పించడం కోసం తమ ప్రభుత్వం ఎంత ఖర్చుకైనా వెనకాడదని సిఎం జగన్ గొప్పగా చెప్పుకొన్నారు. నిజమే. చాలా మంచిదే!
అయితే నవంబర్ 3వ తేదీన బైజూస్ సంస్థ ఇచ్చిన ఓ పేపర్ ప్రకటనలో తమ సంస్థ ఏపీలో 31 లక్షల మంది విద్యార్థులకి, 2 లక్షల మంది ఊపాధ్యాయులకి తమ ప్రీమియం కంటెంట్ని ఏడాదిన్నర పాటు పూర్తి ఉచితంగా అందిస్తున్నామని తెలిపింది. కానీ సిఎం జగన్ దాని కోసం తమ ప్రభుత్వం రూ.778 కోట్లు ఇచ్చిన్నట్లు చెప్పుకొన్నారు. ఎందుకు?దానర్ధం ఏమిటి?
అయినా సమాజంలో నిరుపేద విద్యార్థుల అవసరాలు, వారి అవగాహన సామర్ధ్యం గురించి క్షుణ్ణంగా తెలిసున్న, వారికి ఏవిదంగా అర్దమయ్యేలా పాఠాలు భోదించాలో క్షుణ్ణంగా తెలిసున్న అపార అనుభవమున్న ఉపాధ్యాయులను కాదని ప్రభుత్వం బైజూస్ని ఎంచుకోవడం దేనికి?అది ఉచితంగా ఇచ్చిన కంటెంట్ కోసం రూ.778 కోట్లు చెల్లించిన్నట్లు చెప్పుకోవడం ఏమిటి?ఉపాధ్యాయులకి జీతాలు ఈయకుండా మెరుగైన విద్యకోసమంటూ ప్రభుత్వం రూ.1,466 కోట్లు ఖర్చు చేయడం అవసరమా?
ప్రతీ పిల్లాడికి పదో తరగతి వరకు బలమైన పునాది పడితేనే భవిష్యత్లో రాణించగలుగుతాడు. ఆ దశలో వైసీపీ ప్రభుత్వం ఇటువంటి ప్రయోగాలు చేస్తే చివరికి నష్టపోయేది నిరుపేద విద్యార్ధులే కదా?అప్పుడు దానికి వైసీపీ ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా? అనే ప్రశ్నలకి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సమాధానాలు చెపితే బాగుంటుంది.



