మెగాస్టార్ చిరంజీవికి కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ అవార్డు ప్రకటించగానే సినీ పరిశ్రమలోని వారందరూ, రెండు తెలుగు రాష్ట్రాలలో రాజకీయ నాయకులు ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నారు. వారిలో వైసీపి ఎంపీ విజయ సాయిరెడ్డి కూడా ఉన్నారు. ఇటువంటప్పుడు అందరూ అభినందించడం సర్వసాధారణమైన విషయమే.
అయితే తెలుగు సినీ పరిశ్రమకు సంబందించి సమస్యలను చర్చించేందుకు చిరంజీవి నేతృత్వంలో సినీ ప్రముఖులు తాడేపల్లి ప్యాలస్కు వచ్చినప్పుడు, జగన్మోహన్ రెడ్డి వారిని ఏవిదంగా అవమానించారో తెలుగు ప్రజలందరికీ ఇంకా గుర్తుంది.
వారు కోట్లాది తెలుగు ప్రజల అభిమాన హీరోలు, దర్శకులు, గొప్ప నిర్మాతలు అని కూడా చూడకుండా, ప్యాలస్ బయటే వారి కార్లు నిలిపివేయించి అందరూ లోనికి నడిచి వచ్చేలా చేశారు! ఆ తర్వాత జగన్తో వారు భేటీ అయినప్పుడు కూడా చిరంజీవి చేతులు జోడించి ప్రాధేయపడేలా చేశారు!
ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో తీసిన ఆ వీడియోని బయటకు విడుదల చేస్తే అది చూసి చిరంజీవి అభిమానులు కంట నీరు పెట్టుకున్నారు. సిఎంతో భేటీ తర్వాత జగన్ వారిని సాదరంగా సాగనంపలేదు. మళ్ళీ వారందరూ మళ్ళీ నడుచుకుంటూ బయటకు వెళ్ళారు. ఇంతకంటే దారుణమైన అవమానం ఏముంటుంది? పైశాచిక ఆనందం అంటే ఇదే కదా?
నలబై ఏళ్ళపాటు 155 సినిమాలలో నటించి అనేక అవార్డులు అంతకు మించి తెలుగు ప్రజల హృదయాలలో ‘మెగాస్టార్’గా స్థానం సంపాదించుకున్న చిరంజీవిని జగన్ ప్రభుత్వం గౌరవించిన తీరు ఇది కాగా, కేంద్ర ప్రభుత్వం ఆయనను అత్యంత ప్రతిష్టాత్మకమైన పద్మ విభూషణ్ అవార్డుతో గౌరవిస్తోంది. పెరటి చెట్టు వైద్యానికి పనికి రాదంటే ఇదేనేమో?
ఆనాడు చిరంజీవిని అవమానించిన జగన్ ప్రభుత్వం, నేటికీ ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ని దారుణంగా అవమానిస్తూనే ఉంది. కనుక చిరంజీవి మావాడని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సగర్వంగా చెప్పుకోలేకపోయినా, ఆయనపై బురద జల్లకుండా ఉంటే చాలని అభిమానులు, తెలుగు ప్రజలు కోరుకొంటున్నారు. ఈ నేపధ్యంలో ఇప్పుడు జగన్ ప్రభుత్వం ఏ మొహం పెట్టుకుని చిరంజీవిని ప్రశంశించగలదు?ఆయనను ఆంధ్రాకు పిలిచి సన్మానించే ధైర్యం ఉందా?
తెలుగు సినీ పరిశ్రమ తెలుగు ప్రజల కీర్తి ప్రతిష్టాలను ఆస్కార్ స్థాయి వరకు వ్యాపింపజేస్తుంటే, దానికి పుట్టినిల్లువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనీస గౌరవం, విలువ లేకుండాపోయాయి. ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డుతో మనకు దక్కాల్సిన సంతోషం, గౌరవాన్ని మనమే కాదనుకుంటే, తెలంగాణ రాష్ట్రం, ప్రజలు, ప్రభుత్వం సినీ పరిశ్రమని అక్కున చేర్చుకుని ఆదరిస్తున్నందుకు వారు సగర్వంగా చిరంజీవి మావాడు అని చెప్పుకోగలుగుతున్నారు. ఆ సంతోషాన్ని వారూ పంచుకుంటున్నారు. అది వారి అదృష్టం… ఇది మన దౌర్భాగ్యం!





