ఏపీకి ‘ప్రత్యేక హోదా’ దక్కకపోయినా ఆ పేరుతో రాజకీయాలు చేసుకునేందుకు అన్ని పార్టీలకు సమాన అవకాశాలు లభిస్తూనే ఉన్నాయి. ప్రత్యేక హోదా అనేది జమ్మిచెట్టు మీద దాచి ఉంచిన పాండవుల దివ్యాస్త్రాలవంటిది. కనుక దానిని ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు తీసి వాడుకోవచ్చని మొన్న వైఎస్ షర్మిల, ఇప్పుడు జగన్ నిరూపిస్తూనే ఉన్నారు. అయితే రాష్ట్రంలో అన్ని పార్టీలు కలిసి ‘ప్రత్యేక హోదా’ని ఎవరికీ అంతుపట్టని ఓ బ్రహ్మ పధార్ధంగా మార్చేసి వాడుకుంటున్నందున, ఆ పేరుతో అవి చేసే రాజకీయాలను కూడా ప్రజలు పట్టించుకోవడం మానేశారు. అది వేరే సంగతి.
మొన్న ఎన్నికలు జరిగేవరకు వైఎస్ షర్మిల ప్రతీరోజూ ప్రత్యేక హోదా గురించే మాట్లాడుతూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తూనే, అన్న జగన్మోహన్ రెడ్డిని ఇరుకున పెట్టాలని ప్రయత్నించేవారు. అప్పుడు జగన్ దాని గురించి మాట్లాడేవారు కారు.
కానీ శాసనసభ ఎన్నికలలో వైసీపి ఓడిపోయినప్పటి నుంచి జగన్ ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతుంటే ఆమె ఆమె సైలంట్ అయిపోయారు!
“నాకు 25 మంది ఎంపీలను ఇస్తే నేను మోడీ మెడ వంచి ఏపీకి ప్రత్యేక హోదా సాధిస్తానని” ప్రగల్భాలు పలికిన జగన్, 23 మంది ఎంపీలు ఉన్నా గత 5ఏళ్ళు దాని గురించి మాట్లాడలేదు. ఇప్పుడు మాట్లాడుతున్నారు!
ఏమంటే, మోడీ ప్రభుత్వానికి టిడిపి మద్దతు చాలా కీలకం కనుక, ప్రధాని మోడీ చెయ్యి మెలిపెట్టి ఏపీకి ప్రత్యేక హోదా సాధించాలని జగన్ ఉచిత సలహా ఇస్తున్నారు.
కానీ ప్రత్యేక హోదా లాంటిది కాదు ‘ప్రతిపక్ష హోదా. ’ఇప్పుడు వాడుకోకపోతే మరెన్నటికీ వాడుకునే అవకాశం ఉండదు.
కనుక జగన్మోహన్ రెడ్డి స్పీకర్ అయ్యన్న పాత్రుడికి ఓ లేఖ వ్రాశారు. అయితే అంతమాత్రన్న తనకు ప్రతిపక్ష నాయకుడు హోదా ఇమ్మనమని కాదు.
ఈ పేరుతో కూడా ఎంతో కొంత రాజకీయ మైలేజ్ పొందాలనే తాపత్రయం మాత్రమే. అందుకే స్పీకర్కు వ్రాసిన ఆ లేఖ కాపీనీ ట్విట్టర్లో కూడా పోస్ట్ చేశారు.
అయితే జగన్ మొన్న శాసనసభ్యుడుగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత లేదా మర్నాడు అయ్యన్న పాత్రుడిని స్పీకర్గా ఎన్నుకున్నప్పుడు సభకు హాజరై అడిగినా అర్దం ఉండేది.
కానీ శాసనసభని గౌరవిస్తానని, దాని నియమ నిబంధనలకు కట్టుబడి ఉంటానని ప్రమాణం చేసి 24 గంటలు కాక ముందే ఆ ప్రమాణాన్ని ఉల్లంఘించి పులివెందుల వెళ్ళిపోయిన జగన్మోహన్ రెడ్డి, అక్కడో మూడు రోజులు గడిపి అక్కడి నుంచి బెంగళూరు వెళ్ళిపోయి, అక్కడి నుంచి రూల్స్ మాట్లాడుతూ ఈ లేఖ వ్రాయడం విడ్డూరంగానే ఉంది కదా?
అయినా ‘శాసనసభలో మనకి పనిలేదని’ చెప్పి వెళ్ళిపోయినప్పుడు, ఆ ఎమ్మెల్యే పదవి కూడా అనవసరం కదా? ఇక ప్రతిపక్ష నేత హోదా మాత్రం దేనికి? పోనీ ఇస్తానంటే శాసనసభ సమావేశాలకు తప్పకుండా వస్తానని మాట ఇవ్వగలరా?
ఏపీ అసెంబ్లీ స్పీకర్ కు @ysjagan లేఖ!
మంత్రుల తర్వాత నాతో ప్రమాణ స్వీకారం చేయించడం పద్ధతులకు విరుద్ధం ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వకూడదని ముందుగానే నిర్ణయించుకున్నట్టు ఉన్నారు విపక్షంలో ఎవరికి ఎక్కువ సీట్లు ఉంటే వారికే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చట్టంలో ఉంది ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే… pic.twitter.com/fNK1dXaWCg
— YSR Congress Party (@YSRCParty) June 25, 2024




