అధికారంలో ఉన్నప్పుడు అహంకారంతో విర్రవీగితే చివరికి ఏమవుతుందో గ్రహించేందుకు కేసీఆర్, జగన్ మన కళ్ళ ముందే ఉన్నారు. ఓటమి తర్వాత కూడా అహంకారం ప్రదర్శిస్తే ఏమవుతుందో గ్రహించేందుకు మళ్ళీ కేసీఆరే నిదర్శనంగా నిలుస్తుండటం విశేషం.
పోయినవారు పోగా కేసీఆర్కు ఇంకా 34 మంది ఎమ్మెల్యేలు మిగిలే ఉన్నారు. కనీసం ఆ మాత్రం కూడా లేని జగన్, ఇంకా అహంభావంతో వ్యవహరిస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తుంది. దానినే ఆయన నాయకత్వ లక్షణం అని అనుకుంటున్నారేమో?
అందుకే తనకు శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ స్పీకర్ అయ్యన్న పాత్రుడికి లేఖ వ్రాసి ఆ పేరుతో రాజకీయాలు చేస్తున్నట్లున్నారు.
ఇదివరకు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శాసనసభలో చంద్రబాబు నాయుడుని ఉద్దేశ్యించి మీ 23 మంది ఎమ్మెల్యేలలో ఓ ఐదుగురిని లాగేస్తే అప్పుడు మీకు ఈ ప్రతిపక్ష నాయకుడి హోదా కూడా ఉండదని బెదిరించారు.
అంటే 18 మంది ఎమ్మెల్యేలు ఉన్నా ప్రతిపక్ష నాయకుడి హోదా లభించదని జగన్ స్వయంగా చెప్పారన్న మాట. మరి 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నప్పుడు తనకు ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వాలని ఏవిదంగా అడుగుతున్నారు?ఎందుకు అడుగుతున్నారు?అంటే కొన్ని బలమైన కారణాలు కనిపిస్తున్నాయి.
ఈ పేరుతో రాజకీయాలు చేస్తూ వైసీపిని యాక్టివ్గా ఉంచడం కోసం. రేపు టిడిపి ప్రభుత్వం ఆయనపై ఏమైనా చర్యలు తీసుకుంటే ‘ఏపీలో ప్రతిపక్ష నాయకుడిపై చంద్రబాబు నాయుడు రాజకీయ కక్ష సాధింపులు’ అని హెడ్డింగ్తో సొంత మీడియాలో దుష్ప్రచారం చేసుకోవడానికి.
రాజకీయ నాయకులు ఎన్నికలలో ఓడిపోయినా కూడా ఏదోవిదంగా మీడియాలో కనిపిస్తుండటం చాలా అవసరమే అని జగన్ గ్రహించడం. స్పీకర్కు వ్రాసిన ఆ ఒక్క లేఖతో జగన్ గురించి అన్ని పేపర్లు, న్యూస్ ఛానల్స్లో వార్తలు, ఇలాంటి విశ్లేషణలు ఇంకా వస్తూనే ఉన్నాయి. అందుకే ఈ లేఖ వ్రాశారేమో? అని అనుమానించక తప్పదు.
జగన్ ఏ ఉద్దేశ్యంతో అడుగుతునప్పటికీ, వైసీపి ఎమ్మెల్యేలతో కలిసి శాసనసభ సమావేశాలకు హాజరవుతూ తనకు ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వాలని అడిగినా అర్ధం ఉండేది. కానీ శాసనసభలో మనకి పని లేదంటూ రెండో రోజునే మొహం చాటేసి వెళ్ళిపోయిన జగన్కు ప్రతిపక్ష నాయకుడి హోదా అవసరమా?




