వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో సహవాసం చేయడం వలన ఐఏఎస్, ఐపీస్ అధికారులు చెడిపోయారా? లేక అటువంటి దుర్లక్షణాలు ఉన్నందునే వారు జగన్తో సహవాసం చేశారా?అనే ప్రశ్నలకు ఎవరికి తోచిన సమాధానాలు వారు చెప్పుకోవచ్చు.
కానీ నాడు అక్రమాస్తుల కేసు మొదలు నేడు మద్యం కుంభకోణం కేసు వరకు జగన్తో సహవాసం చేసిన ప్రతీ ఐఏఎస్, ఐపీస్ అధికారి పోలీస్ స్టేషన్లు, కోర్టులు చుట్టూ తిరుగక తప్పడం లేదు. మరికొందరు జైలుకి కూడా వెళ్ళక తప్పడం లేదు.
ఆ జాబితా చాలా పెద్దదే ఉంది. కనుక ఇప్పుడు దాని గురించి చెప్పుకుంటే కొత్తవారికి అన్యాయం చేసినట్లవుతుంది.
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సిఎంవో కార్యదర్శిగా చేసిన ధనుంజయ్ రెడ్డి (ఏ31), ఆఫీసర్ ఆన్లైన్ స్పెషల్ డ్యూటీ (జగన్ ఓఎస్డి) కృష్ణ మోహన్ రెడ్డి (ఏ32), భారతి సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్ప బాలాజీ (ఏ33) ముగ్గురి పేర్లను మద్యం కుంభకోణం కేసులో నిందితులుగా సిట్ చేర్చింది.
ఈ కేసులో కర్త, ఖర్మ, క్రియగా వ్యవహరించిన ఏ-1 కసిరెడ్డి రాజ్, వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ముగ్గురూ కలిసి ఈ కుంభకోణం ప్లాన్ చేయగా, వారికి ప్రతీ దశలో వీరు ముగ్గురూ సహకరించారని సిట్ ఛార్జ్-షీట్లో పేర్కొంది.
మద్యం సిండికేట్స్ నిర్వహణ మొదలు లిక్కర్ కంపెనీల నుంచి కమీషన్ల వసూళ్ళు, వాటిని సూట్ కేసు కంపెనీలకు మళ్ళించడం వరకు, ప్రతీ దశలో వీరి ముగ్గురి ప్రమేయం ఉందని సిట్ ఛార్జ్-షీట్లో పేర్కొంది.కనుక సిట్ బృందం మద్యం కుంభకోణం కేసు మూలాలకు చేరుకున్నట్లే భావించవచ్చు.
కానీ ఇంత మంది నిందితులు, వారు బయటపెడుతున్న వివరాలు, సిట్ వద్ద ఉన్న సాక్ష్యాధారాలతో ఈ కుంభకోణంలో అసలు సూత్రధారి వద్దకు ఎప్పుడు చేరుకుంటుందో?ఎప్పుడు నోటీస్ ఇచ్చి విచారణకు రప్పిస్తుందో ఎవరికీ తెలియదు.
కానీ ఈ కేసులో అసలు సూత్రధారిని సిట్ అరెస్ట్ చేసి జైలుకి పంపించగలిగితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో పెను మార్పులు మొదలయ్యే అవకాశం ఉంటుంది.




