ఇప్పటికే జగన్ కు సంబంధించి కొన్ని వందల కోట్ల రూపాయల విలువైన ఆస్తులను అటాచ్ చేసిన ‘ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్’ ఖాతాలో త్వరలో జగన్ మీడియా సాక్షి కూడా చేరిపోతుందన్న వార్తలు ప్రచారంలో ఉన్నాయి. అయితే అంతకు ముందే మరింత షాక్ కు గురి చేసే వార్త ఏమిటంటే… హైదరాబాద్, బంజారాహిల్స్ లో జగన్ నివాసం ఉంటున్న లోటస్ పాండ్ భవనాన్ని ఈడీ తాత్కాలిక జప్తు చేసింది.
లోటస్ పాండ్ తో పాటు హైదరాబాద్ లో ఉన్న సాక్షి టవర్స్ ను, బెంగుళూరులో ఖరీదైన వాణిజ్య భవన సముదాయాన్ని కూడా ఈ జప్తులో చేర్చింది. మొత్తం 749 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ తాత్కాలిక జప్తు చేయగా, ఇందులో పలు కంపెనీలలో జగన్ మరియు ఆయన సతీమణి భారతిలు షేర్ల రూపంలో పెట్టిన పెట్టుబడులను అటాచ్ చేసింది. భారతి సిమెంట్స్ కు సంబంధించి 152 కోట్ల విలువైన సున్నపురాయి నిక్షేపాలు అక్రమంగా కేటాయించినట్లు ఈడీ నిర్ధారించింది.
తానూ ఒక్క రూపాయి కూడా అక్రమ సంపాదనను ఆర్జించలేదని చెప్తూ వస్తున్న వైసీపీ అధినేత జగన్, మరి ఈ అటాచ్ మెంట్లకు ఎలాంటి వివరణ ఇచ్చుకుంటారు? గతంలో కూడా కొన్ని వందల కోట్ల రూపాయల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసిన సందర్భంలో కూడా తానూ ఒక్క రూపాయి అవినీతికి పాల్పడలేదని, అక్రమార్జన చేయలేదని జగన్ చెప్పిన విషయం తెలిసిందే. మరి జగన్ ఎవరినీ పిచ్చివారిని చేయడానికి చెప్తున్నారో గానీ, ఓ పక్కన జగన్ చెప్తూనే ఉన్నారు, మరో పక్క ఈడీ ఆస్తులను అటాచ్ చేస్తూనే ఉంది.



