ఓ రాజకీయ పార్టీకి సొంత మీడియా, సోషల్ మీడియా ఎంత అవసరమో వైసీపిని చూస్తే అర్దమవుతుంది. అధికారంలో ఉన్నప్పుడు అధినేత జగన్మోహన్ రెడ్డికి బాజాభజంత్రీలు మోగించడానికి, ఆయన తరపున ప్రత్యర్దులతో ఓ రాజకీయ పార్టీలా పోరాడేందుకు ఎంతో తోడ్పడింది.
ఇప్పుడు వైసీపితో పాటు వారి మీడియా, సోషల్ మీడియా కూడా ప్రతిపక్షంలోకి మారినట్లు వ్యవహరిస్తుండటం విశేషం.
నేను లేని తెలంగాణను రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్ని విదాలా భ్రష్టు పట్టించేసిందని కేసీఆర్ చెప్పుకుంటున్నట్లే, జగన్ లేని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు కేవలం నెలన్నర రోజులలోనే భ్రష్టు పట్టించేశారని సాక్షి మీడియా కనిపెట్టి ప్రజలకు తెలియజేస్తోంది.
‘జగన్ ఉండి ఉంటే బటన్ నొక్కి సంక్షేమ పధకాలు విడుదల చేస్తుండేవారు. వాలంటీర్లు ఇళ్ళకు వచ్చి అవ్వాతాతలకు పింఛన్లు చెల్లిస్తుండేవారు. జగన్ ఉండి ఉంటే అన్ని వ్యవస్థలు సక్రమంగా పనిచేస్తూ ఉండేవి. రాష్ట్రంలో శాంతి భద్రతలు నెలకొని ఉండేవి. పూర్తి బడ్జెట్ ప్రవేశ పెట్టి ఉండేవారు.
కానీ 40 ఏళ్ళ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన నెలన్నర రోజులకే రాష్ట్రంలో ఇంత దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. జగన్ తీసుకున్న ప్రతీ నిర్ణయాన్ని తప్పు పడుతూ, లోపాలు ఎంచుతూ చంద్రబాబు నాయుడు పక్కన పెట్టేస్తుండటం వలన బ్రేకులు వేసిన్నట్లు రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు స్తంభించిపోయాయి. ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు…ఇళ్ళలో నుంచి బయటకు రావడానికే భయపడుతున్నారు,’ అంటూ నెలరోజులుగా వండి వడ్డించేస్తూనే ఉంది.
ఓటమినే అంగీకరించలేని జగన్ ఇంకా ఏదో భ్రమలో ఉండి ఉంటే ఉండవచ్చు. కానీ ఆయనను ఆ భ్రమలో నుంచి మేల్కొలిపి కర్తవ్యం భోదించి సరైన దిశలో నడిపించాల్సిన ఆయన సొంత మీడియా, ఇలాంటి రాతలతో ఇంకా జగన్కి శల్యసారధ్యం చేస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తుంది. అది ఆయన మనసాక్షి గాబట్టి ఆయనకు నచ్చిన్నట్లు రాస్తోందని సరిపెట్టుకోవాలేమో?
జగన్ అధికారంలో ఉన్నప్పుడు వరుసపెట్టి తప్పులు చేస్తుంటే ఇలాంటి ‘శ్రేయోభిలాషులు’ అందరూ కూడబలుక్కున్నట్లు ఇలాగే తందానతాన పాడుతూ వైసీపి ఓటమికి కారణం అయ్యారు.
ఓటమి తర్వాత కూడా ‘శ్రేయోభిలాషులు’ జగన్ని విడిచిపెట్టకపోవడం లేదా ఆయన వదిలించుకోకపోవడం వైసీపి దౌర్భాగ్యమే అని చెప్పక తప్పదు.




