గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యి అప్పుడే 5 రోజులయ్యింది. ఆయన అరెస్టుపై జగన్ వెంటనే స్పందించలేదు. మర్నాడు ఖండించారు. ఆలోగా వైసీపీ నేతలు, వారి సొంత మీడియా సిఎం చంద్రబాబు నాయుడు, కూటమి ప్రభుత్వంపై ‘ప్రతీకార రాజకీయాలు చేస్తున్నారంటూ’ రొటీన్ విమర్శలు చేశారు.
వంశీ కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు కనుక ఆ వర్గాన్ని రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారు. కానీ ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కారణాలు అందరికీ తెలుసు.
అసలు వైసీపీలో ఉన్న కమ్మ, కాపు నేతలు ఎవరికీ వారి సామాజిక వర్గంలో గౌరవం లేదు. వారు వైసీపీలో జగన్కు ఊడిగం చేస్తూ తమ ఆత్మగౌరవం తాకట్టుపెట్టేయడమే కాకుండా, జగన్ కోసం తమ సామాజిక వర్గాలకే చెందిన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులను చాలా దారుణంగా కించపరిచారని అసహనంగా ఉన్నారు.
వైసీపీలోని వంశీ, కొడాలి నాని, పేర్ని నాని తదితర కమ్మ, కాపు నేతలు మాట్లాడిన మాటలు, చేసిన అవినీతి, దౌర్జన్యాలు తమ సామాజిక వర్గాలకు చెడ్డపేరు తెచ్చిపెట్టాయని ఆయా వర్గాల ప్రజలు భావిస్తున్నారు. అందువల్లే వంశీని పోలీసులు అరెస్టు చేసినా ఎవరూ పట్టించుకోలేదు. రేపు కొడాలి నాని, పేర్ని నానిలను అరెస్ట్ చేసినా ఎవరూ పట్టించుకోకపోవచ్చు.
కులబలం లేని, కోల్పోయిన నేతలు ఏపీ రాజకీయాలలో రాణించలేరు. కనీసం పార్టీ అండదండలున్నా ఎలాగో నెగ్గుకు రావచ్చు. కానీ జగన్ కోసం లేదా జగన్ అండదండలు చూసుకొని చెలరేగిపోయిన వైసీపీలో కమ్మ, కాపు నేతల పరిస్థితి, ఇప్పుడు రెంటికీ చెడిన రేవడిగా మారిన్నట్లయింది.
నేడు జగన్ విజయవాడ సబ్ జైలులో ఉన్న వంశీని పరామర్శించడానికి వస్తున్నారు. అంటే వంశీకి అండగా ఉన్నామని గట్టిగా చెప్పడం కోసం. కానీ అదే చేయరు.
పరామర్శ తర్వాత జగన్ బయటకు వచ్చి ఏం మాట్లాడుతారో అందరికీ తెలుసు. అంటే సిఎం చంద్రబాబు నాయుడుని విమర్శించేందుకు వంశీ అరెస్ట్ మరో అవకాశంగా మాత్రమే జగన్ భావిస్తారు తప్ప వంశీ కోసం కాదన్న మాట!




