జగన్ కు షాక్ ఇచ్చిన ఉద్యోగులు!

AP Employees Chalo Vijayawadaప్రభుత్వ ఉద్యోగులు తలపెట్టిన “ఛలో విజయవాడ”ను ఎట్టి పరిస్థితులలో నియంత్రించాలని భావించిన జగన్ సర్కార్ కు షాక్ ఇచ్చే విధంగా అనేక రూపాల్లో విజయవాడకు చేరుకోవడం విశేషం. ముందు రోజు నుండే విజయవాడను పోలీసులతో ప్రభుత్వం అష్టదిగ్భంధనం చేయించింది.

రహదారులపై ప్రయాణించే అన్ని వాహనాలను తనిఖీలు చేసి అనుమానం వచ్చిన ప్రతి వ్యక్తిని క్రిందికి దించివేస్తూ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అయితే ప్రభుత్వ ఎత్తుగడను ముందే పసిగట్టిన ఉద్యోగులు వివిధ వేషాలు వేసుకుంటూ విజయవాడకు చేరుకున్నారు.

ADVERTISEMENT

ఇలా ముందు రోజే చేరుకున్న ఉద్యోగులు ఒక్కసారిగా రోడ్డు పైకి రావడంతో, నియంత్రించడం పోలీసుల వల్ల కూడా కాలేదు. ఇందులో మహిళా ఉద్యోగులు సైతం పెద్ద సంఖ్యలో పాల్గొని జగన్ ప్రభుత్వం చేసిన విశ్వప్రయత్నాలను తిప్పి కొట్టారు.

సీఎం జగన్ డౌన్ డౌన్… ఇదేమి రాజ్యం దోపిడీ రాజ్యం దొంగల రాజ్యం అంటూ నినాదాలు చేస్తూ తమ సత్తాను ఉద్యోగులు ప్రదర్శించారు. పిల్లలకే కాదు, ప్రభుత్వానికి కూడా గుణపాఠం చెప్తామని ఉపాధ్యాయులు కదం తొక్కుతూ ముందుకు కదలడంతో చేతులెత్తేయడం పోలీసుల వంతయ్యింది.

ప్రభుత్వ తీరు తీవ్రవాదుల కంటే దారుణంగా ఉందని, దీనిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని, ప్రతిపక్షంలో ఉండగా నేను ఉన్నాను, నేను విన్నాను అంటూ చెప్పిన జగన్ మోహన్ రెడ్డి, ఇప్పుడు మాత్రం తాడేపల్లి నివాసానికే పరిమితం అయ్యారని దుయ్యబట్టారు.

సలహాదారుల మాటలు కాదు, ఉద్యోగుల మాటలు కూడా వినాలని జగన్ తీరును ప్రశ్నిస్తున్నారు. మునుపెన్నడూ లేని రీతిలో విజయవాడకు విచ్చేయకుండా చేయడానికి ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా ‘ఛలో విజయవాడ’ పిలుపుకు మంచి స్పందన కావడం విశేషం.

దీంతో అటు ప్రభుత్వం, ఇటు ఉద్యోగులు ఎవరూ తగ్గేది లేదు అన్న విషయాన్ని చెప్పకనే చెప్తున్నాయి. ఇదిలా ఉంటే మరో మూడు రోజుల్లో ఆర్టీసీతో సహా అన్ని ఉద్యోగ సంఘాలు నిరవధిక సమ్మెకు పిలుపునివ్వడంతో ప్రభుత్వం ఎలాంటి వ్యూహరచన గావిస్తుందో అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.

ADVERTISEMENT
Latest Stories