ఫ్లెక్సీలు తొలగించగలరు… కానీ దస్తావేజులపై జగన్‌ ముద్రలు ఎలా?

YS Jagan Photo on Beneficiaries Registration Documents

జగన్‌ పాలనలో ప్రచారయావ ఎంత పరాకాష్ఠకు చేరుకుందో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. వైసీపి రంగులు, స్టిక్కర్లు, సిద్దం పోస్టర్లు, బ్యానర్లు, సంక్షేమ పధకాల ప్రకటనల గురించి తెలియనివారుండరు. రాష్ట్రంలో ఎన్నికల ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది కనుక వైసీపి నేతల సిద్దం పోస్టర్లను మునిసిపల్ సిబ్బంది తొలగిస్తున్నారు. కానీ ఎవరూ తొలగించలేనివి ఇంకా చాలానే ఉన్నాయి.

ఉదాహరణకు జగన్‌ ప్రభుత్వం పేదలకు ఇస్తున్న ఇళ్ళ పట్టాల దస్తావేజులపై జగన్‌ బొమ్మ ‘వాటర్ మార్క్’ ముద్రించి ఇచ్చారు. ఆస్తి పత్రాలపై కూడా జగన్‌ బొమ్మని ముద్రించాలనే జగన్‌ ప్రభుత్వ ‘గొప్ప పిచ్చి ఆలోచన’కు ఇప్పుడు లబ్ధిదారులతో సహా రెవెన్యూ, ఎన్నికల సంఘం అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

ADVERTISEMENT

ఇక విద్యార్ధులకు ఇస్తున్న స్కూలు బ్యాగులు, నోట్ పుస్తకాలు, ట్యాబ్‌లు, చిక్కీ ప్యాకెట్లు, చివరికి కోడిగుడ్లపై కూడా జగన్‌ ఫోటోలు ముద్రింపజేశారు. ఇప్పుడు ఎన్నికల కోడ్ కారణంగా వాటన్నిటిపై జగన్‌ బొమ్మలు కనిపించకుండా చేయడానికి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, సిబ్బంది పనులు మానుకొని వాటికి కాగితాలు అంటిస్తున్నారు.

అంగన్వాడీ కేంద్రాలకు పంపిణీ చేసే బియ్యం, రాగిపిండి బస్తాలు, పాల ప్యాకెట్లపైన జగన్‌ ముద్రలు కనబడకుండా చేసేందుకు అందరూ శ్రమిస్తున్నారు. మరో మూడు నెలలు ఏకధాటిగా అందరూ శ్రమించినా నవరత్నాలు, సంక్షేమ పధకాలలో జగన్‌ బొమ్మలని తొలగించలేని పరిస్థితి నెలకొంది.

ఇక టిడ్కో ఇళ్లకు వేలకోట్లు ఖర్చు చేసి వైసీపి రంగులు వేయించుకున్నారు. ఇప్పుడు వాటిని మార్చాలంటే మళ్ళీ వేలకోట్లు అవసరం ఉంటుంది కనుక వాటిని ఎన్నికల కోడ్ నుంచి మినహాయించక తప్పదు. ఇలా మినహాయించవలసినవి ఇంకా చాలానే ఉన్నాయి. కనుక అందరూ తలలు పట్టుకొంటే, జగన్‌ బొమ్మలు చిద్విలాసంగా చిర్నవ్వులు చిందిస్తూనే ఉన్నాయి.

వైసీపి కార్యాలయాలుగా పనిచేస్తున్న సచివాలయాలలో జగన్‌ ఫోటో, జగన్‌ ముద్రలతో నిండిపోయి ఉన్నాయి. చివరికి వాటిలో పనిచేస్తున్న సిబ్బందిలో చాలామందికి ఇవన్నీ ఓ అంటురోగంలా అంటుకుపోయాయి. వీటిని వదిలించడం ఎవరి తరం కాదు.

జగన్మోహన్‌ రెడ్డి ఇంత దూరదృష్టి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో చూపి ఉండి ఉంటే నేడు రాష్ట్రం పరిస్థితి, వైసీపి పరిస్థితి మరోలా ఉండేవి కదా?

ADVERTISEMENT
Latest Stories