ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బుదవారం మధ్యాహ్నం ఢిల్లీకి బయలుదేరుతున్నారు. రెండువారాల వ్యవధిలో సిఎం జగన్ రెండుసార్లు ఢిల్లీకి వెళ్ళి ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలను కలుస్తున్నారు. ఈసారి ఢిల్లీ వెళ్ళే ముందు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్లా నజీర్తో భేటీ అవడంతో సిఎం జగన్ మధ్యంతర ఎన్నికలకు వెళ్ళే ఆలోచనలో ఉన్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రధాని నరేంద్రమోడీ, అమిత్ షాలకి తెలియజేసి, వారి అనుమతితో ముందస్తు ఎన్నికలకు వెళ్ళాలనుకొంటున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఎమ్మెల్సీ ఎన్నికలలో వైసీపీ నాలుగు సీట్లు కోల్పోవడంతో తన ప్రభుత్వం పట్ల ప్రజలలో అసంతృప్తి ఉందనే విషయం గుర్తించినందున జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని భావిస్తే ఆశ్చర్యం లేదు. ఇప్పటికే నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలను స్వయంగా బయటకు పంపగా, మరో 16 మంది తమతో టచ్లో ఉన్నారని టిడిపి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు చెప్పగా, 16 మంది కాదు… 40 మంది అని ఏపీ టిడిపి అధ్యక్షుడు అచ్చన్నాయుడు చెప్పడం మైండ్ గేమ్ అనుకొన్నా, వైసీపీకి ఇటువంటి ప్రమాదం పొంచి ఉందనేది వాస్తవం.
రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులతో పాటు ఆర్ధిక పరిస్థితి కూడా రాన్రాను దిగజారుతూనే ఉందని అందరికీ తెలుసు. ఉద్యోగులకు నెలనెలా 1వ తేదీన జీతాలే చెల్లించలేకపోతున్న ప్రభుత్వం, వందల కోట్లతో సంక్షేమ పధకాలను యధాతధంగా కొనసాగించడం మున్ముందు చాలా కష్టం అవుతుంది. అదే కనుక జరిగితే ఇంతకాలం వాటితో లబ్దిపొందినవారు కూడా అసంతృప్తి చెంది వైసీపీకి వ్యతిరేకంగా మారితే ఎన్నికలలో ఘోరపరాజయం పాలయ్యే ప్రమాదం ఉంటుంది. ఉద్యోగ సంఘాలు తమ డిమాండ్ల సాధనకు ఉద్యమానికి సిద్దం అవుతున్నారు. కానీ ఈ పరిస్థితులలో ప్రభుత్వం వారి డిమాండ్స్ నెరవేర్చలేదు. కనుక వారూ వైసీపీకి వ్యతిరేకించడం ఖాయం. కనుక పరిస్థితులు పూర్తిగా చేజారిపోక ముందే ముందస్తు ఎన్నికలకు వెళ్ళి ఈ సమస్యలన్నిటి నుంచి బయటపడవచ్చని సిఎం జగన్ భావిస్తే ఆశ్చర్యం లేదు.
ఒకవేళ ముందస్తు ఎన్నికల కోసం సిఎం జగన్ ఢిల్లీకి వెళ్ళడం లేదనుకొంటే, మళ్ళీ 1వ తేదీ వచ్చేస్తోంది కనుక ఉద్యోగుల జీతాల చెల్లింపుకి, సంక్షేమ పధకాలకు నిధులు (అప్పులు) అవసరం కనుక దాని కోసం వెళ్తుండవచ్చు. సుప్రీంకోర్టు రాజధాని కేసును జూలై 11కి వాయిదా వేసినందున తమకు అనుకూలంగా ఆ కేసును త్వరగా తేల్చేయమని అభ్యర్ధించడానికి కావచ్చు.
వివేకా హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి అరెస్ట్ కాకుండా కాపాడుకోవలసిన బాధ్యత కూడా సిఎం జగన్పైనే ఉంది. వారిద్దరినీ కాపాడుకోలేకపోతే, పార్టీలో మిగిలినవారికి సిఎం జగన్ మీద నమ్మకం కోల్పోతే, గోడ దూకేసే ప్రమాదం పొంచి ఉంది. కనుక సిఎం జగన్ ఏ కారణంతో ఢిల్లీ పెద్దల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నప్పటికీ ఈ సమస్యల సుడిగుండంలో నుంచి బయటపడేందుకే అని భావించవచ్చు.
—



