చెప్పాడంటే…చేయడంతే..! జగన్నాటకం..!

YS Jaganజగన్ ప్రతిపక్షంలో ఉండగా “చెప్పాడంటే.. చేస్తాడంతే” అంటూ జగన్ మద్దతుదారులు చేసిన ప్రచార ఆర్భాటాలు జగన్ అధికారంలోకి రాగానే తారుమారు చేశారు. గడిచిన నాలుగేళ్ళ జగన్ పాలన చూసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఇప్పుడు ఒక కొత్త స్లోగన “చెప్పాడంటే…చేయడంతే..!” అందుకున్నారు.

“మాట తప్పడు.. మడం తిప్పడు”..,”రావాలి జగన్ …కావాలి జగన్”…అంటూ ఇలా వైసీపీ సోషల్ మీడియా ప్రచారం చేసిన ప్రతి స్లోగన్లకు కొన్ని ఉదాహరణలు కూడా జత పరుస్తూ వైసీపీ ప్రభుత్వానికి సోషల్ మీడియా వేదికగా గట్టి కౌంటర్లే పడుతున్నాయి. జగన్ ప్రతిపక్షంలో ఉండగా 30వేల ఎకరాలు కాదు 40వేల ఎకరాలతో రాజధాని నిర్మాణం చేపట్టాలని, అమరావతి రాజధాని నిర్ణయానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు పలుకుతుందని అసెంబ్లీ సాక్షిగా మాట ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే మూడు రాజధానులు అంటూ మడం తిప్పారు.

ADVERTISEMENT

ఒక రాజధాని వద్దు మూడు రాజధానులే ముద్దు అంటూ కనీసం తన ప్రభుత్వ నిర్ణయాన్ని అయినా అమలు పరుస్తారేమో అనుకుంటే గడిచిన మూడేళ్లుగా మూడు మూడు…అంటున్నారే కాని ముందడుగు వేయడంలేదు. వేస్తారన్న నమ్మకం లేదు ఎందుకంటే జగన్ చెప్పటంటే చేయడంతే.! ప్రతిపక్షంలో ఉండగా రాష్ట్రంలో పూర్తి మద్యపాన నిషేధం చేస్తామని అంటూ మాట ఇవ్వడం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ మద్యం దుకాణాలు ఏర్పాటు చేయడంతో జగన్ మరోసారి మడం తిప్పక తప్పలేదు.

రాష్ట్రంలో సంపూర్ణ మద్యనిషేధం అమలు చేసిన తరువాతనే తిరిగి మా ప్రభుత్వం ప్రజలను ఓటు అడగడం జరుగుతుంది అంటూ బాహాటంగా మాట ఇచ్చిన జగన్, 2024 వరకు మద్యం పాలసీని పొడిగిస్తూ తీసుకున్న నిర్ణయం కూడా చెప్పాడంటే చేయండంతే కార్యక్రమంలో భాగమేనా? ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండరు అంటూ ఇచ్చిన హామీలు వాలంటీర్ జాబులతో సరిపెట్టారు.

ప్రతిపక్షంలో ఉండగా కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తాము అంటూ పలికిన ప్రగల్భాలు అధికారం రాగానే కేంద్ర నిర్ణయానికి దాసోహం అంటూ మడం తిప్పక తప్పలేదు .కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, పార్టీలు చూడం… అంటూ చేసిన ప్రచారాలు తమ పార్టీ కార్యకర్తలకే వాలంటీర్ జాబులు అంటూ వైసీపీ పెద్దల ప్రసంగాలతో తేటతెల్లమయింది.

పాలసీలలో పారదర్శకత అన్నారు వ్యాపారాలను పాతాళానికి తొక్కారు. పిల్లలకు అమ్మ ఒడి అన్నారు,తన కల్తీ మద్యంతో ఆ పిల్లలకే తండ్రులను దూరం చేస్తున్నారు. రాష్ట్రంలో కరెంటు చార్జీల పెంపు ఉండదని జగన్ తన ప్రమాణస్వీకారం రోజు ఇచ్చిన హామీ బిల్లులు చూస్తున్న ప్రజలకు ఇప్పటికి వడదెబ్బ మాదిరే తగులుతున్నాయి. రివర్స్ టెండరింగ్ పేరుతో పోలవరం ప్రాజెక్టుకు ఆనకట్టకట్టారు.

ప్రభుత్వాలు రైతులకు ఉచిత కరెంటు ఇవ్వాల్సింది పోయి పొలాలలో మోటార్లకు మీటర్లు బిగించడం కూడా జగన్ రైతులకు చేసిన మేలే అవుతుందా? ప్రభుత్వం ఉద్యోగులకు సీపీఎస్ రద్దు చేస్తాను అన్నాడు. కానీ చెప్పాడు కాబట్టి చెయ్యలేదు అనుకోవాలి మరి.! ప్రతిపక్షంలో ఉన్నకాలంలో జగన్ వివేకానందరెడ్డి హత్య కేసు సిబిఐ కి అప్పగించాలి అన్నారు. అధికారంలోకి వచ్చాక అవసరం ఏముంది అంటున్నారు. అప్పట్లో ‘నారావారి రక్త చరిత్ర’ అన్నారు ఇప్పుడు ‘కుటుంబ కలహాలే’ హత్యకు దారితీసాయి అంటున్నారు. ఇది కూడా మాట తప్పడం మడం తిప్పడంలో భాగమేనా!

విలువలు – విశ్వశనీయతే మా పార్టీ సిద్ధాంతాలు అన్న జగన్ హత్య నేరస్తులకు అండగా నిలబడం ఏ విలువలకు అద్దం పడుతుందో కూడా సెలవిస్తే బాగుంటుంది. జగన్ ప్రభుత్వ విధానాలతో పేదల బతుకులలో వెలుగును నింపడం మాట అటుంచితే సామాన్య మధ్యతరగతి ప్రజా జీవితాలలో చీకటిని మిగులుస్తున్నాయని చెప్పక తప్పని పరిస్థితి. తలకు మించిన భారం మోయడం ఆరోగ్యానికి హానికరం అదేవిధంగా రాష్ట్ర బడ్జెట్ కు మించిన సంక్షేమం రాష్ట్రానికి చేటు అనేది అటు రాజకీయ నాయకులు ఇటు రాష్ట్ర ప్రజలు గ్రహించాలి.

ఇలా సంక్షేమమే పరమావిధిగా ప్రభుత్వాలు ముందుకెళ్తే రివెర్స్ టెండరింగులు కాదు “చెప్పాడంటే చేయడంతే ” – రావాలి జగన్ కావాలి జగన్ కు బదులు సైకో పోవాలి సైకిల్ రావాలి, పవన్ రావాలి పాలన మారాలి అంటూ ప్రభుత్వాలకు రివర్స్ స్లొగన్స్ తో ప్రజలు ఎప్పుడు ముందుంటారని రాజకీయ పార్టీలు గుర్తుంచుకోవాలి.

ADVERTISEMENT
Latest Stories