ప్రధాని నరేంద్ర మోడీ పెద్ద నోట్లు రద్దు చేసి దాదాపుగా పది రోజులు కావస్తోంది. కానీ, ఈ అంశంపై కనీసం మాట వరుసకు కూడా జగన్ పెదవి విప్పకపోవడంతో, సోషల్ మీడియాలో వైసీపీ అధినేతపై పడుతున్న ఛలోక్తులకు, కౌంటర్లకు కొదవలేదు. అయితే ఎవరు ఏమనుకున్నా… తను అనుకున్నదే చేసే వైఎస్ జగన్, వాటిని ఏ మాత్రం పట్టించుకోకుండా, మీడియాకు దూరంగా ఉన్నారు. అయితే అసలు నోట్ల రద్దుపై జగన్ అభిప్రాయం చెప్పకున్నా… పర్లేదు గానీ, ఒక్కసారి అసలు జగన్ ఎలా ఉన్నారో అని చూడాలనుకునేవారికి మాత్రం ఓ అవకాశం లభించింది.
అవును… నిజమే… ఓ పక్కన ఇప్పటికే కొన్ని వందల కోట్ల ఆస్తులను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అటాచ్మెంట్ చేయగా.., మరో పక్కన సీబీఐ అక్రమాస్తుల కేసులు కొనసాగుతున్నాయి. దీంతో సహజంగానే ‘బ్లాక్ మనీ’ అంశం జగన్ చుట్టూ తిరగడం, జగన్ ఎలా ఉన్నారో చూడాలనే ఆకాంక్ష సగటు ప్రజానీకం ఆసక్తి కనపరచడం సహజమే. ఆ అవకాశం బుధవారం నాడు కల్పించారు జగన్. ‘నమస్తే తెలంగాణా’ ఎండీ ఇంట వివాహ మహోత్సవానికి వైఎస్ జగన్ హాజరు కావడంతో, నోట్ల రద్దు తర్వాత తొలిసారిగా మీడియా కంట పడ్డారు వైసీపీ అధినేత.
అయితే చంద్రబాబుపై గానీ, బాబు సర్కార్ పై గానీ మండిపడే సమయంలో జగన్ లో కనిపించే ఉత్సాహం, ఉల్లాసం ఇసుమంత కూడా తారసపడకపోవడం విశేషం. జరిగేదేదో జరగనీయ్… అన్న రీతిలో కాస్త చిరుదరహాసం ఇస్తూ నిస్తేజంగా ఈ వేడుకలో కనిపించడం ఓ విధంగా పార్టీ వర్గాలను కూడా నిరుత్సాహంలోకి నెట్టింది. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నపుడు జైలుకెళ్ళిన సమయంలో కూడా జగన్ ఇంతకంటే ధైర్యంగానే ఉన్నారని, అలాగే ఇటీవల పార్టీ నుండి ఎమ్మెల్యేలు వరుసగా అధికార పార్టీలోకి క్యూలు కడుతున్నపుడు కూడా జగన్ ఎవరినీ లెక్కచేయలేదని, కానీ, ప్రస్తుతం ఆ ధోరణి మాత్రం కనిపించడం లేదని పొలిటికల్ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. మరి దీనికి కారణమేంటబ్బా..? ఎనీ గెస్..!?



