జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైఎస్సార్ కాంగ్రెస్ దృష్టి పెట్టినట్టుగా కనిపిస్తుంది. కాపు నేస్తం పథకాన్ని విమర్శిస్తూ జనసేన ఒక ప్రెస్ రిలీజ్ విడుదల చేస్తే ఆ వెంటనే అదే కాపు కులానికి చెందిన మంత్రి కన్నబాబుతో ప్రెస్ మీట్ పెట్టించి పవన్ కళ్యాణ్ ని తిట్టించింది వైఎస్సార్ కాంగ్రెస్ అధినాయకత్వం.
తాజాగా తమ పార్టీ రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు వైపు నుండి ప్రజల దృష్టి మరల్చడానికి కూడా జనసేననే వాడుకుంటున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ వారు. ఉన్నఫళంగా సమయం సందర్భం లేకుండా జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ రావు ని మీడియా చానెళ్లకు ఇంటర్వ్యూలు ఇప్పిస్తున్నారు.
సహజంగానే రాపాక ఆ ఇంటర్వ్యూలలో పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేస్తూ… జగన్ మీద స్వామి భక్తి చూపుతూ రక్తి కట్టిస్తున్నారు. ఈ ఇంటర్వ్యూలు వైఎస్సార్ కాంగ్రెస్ అనుకూల మీడియా ఛానెల్స్ లో రావడమే ఇందుకు నిదర్శనం. రఘురామ కృష్ణంరాజు విషయం వదిలేసి జనసేన గురించి ప్రజలు మాట్లాడుకుంటారని వైఎస్సార్ కాంగ్రెస్ వ్యూహం.
అయితే రాపాక పార్టీ గీత దాటేశారు అనేది పాత మాట. ఇప్పటికే ఆ పార్టీ నాయకులు, అభిమానులు ఆయనకు నీళ్ళొదిలేశారు. కాకపోతే జనసేన అస్తిత్వం గురించి ఏమైనా వ్యాఖ్యలు చేస్తే మీడియాలో ప్రముఖంగా వస్తాయి కాబట్టి తమ పని అయినట్టే అని అధికార పార్టీ అనుకుంటుంది. దీనిపై పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారో చూడాలి!





