తెలుగు సినిమాలకి ఆంధ్రప్రదేశ్ పుట్టినిల్లువంటిది. కానీ సిఎం జగన్ స్వయంగా బొట్టు పెట్టి పిలుస్తున్నా ఎవరూ పుట్టింటికి రావడం లేదు! మెట్టినిల్లు తెలంగాణలోనే తమకు బాగుందని అక్కడే సెటిల్ అయిపోయారు.
ఈ నేపధ్యంలో ‘ఏపీలో చిత్రపరిశ్రమ అభివృద్ధిపై సిఎం జగన్ మార్క్’ అంటూ బుధవారం సాక్షి మీడియాలో వచ్చిన కధనం చూస్తే ఎవరైనా నోరు వెళ్ళబెట్టాల్సిందే.
ఏపీకి సినీ పరిశ్రమని రప్పించడానికి మాజీ సిఎం చంద్రబాబు నాయుడు ఏమీ చేయలేదని, అసమదీయులకు స్టూడియోల పేరుతో విలువైన భూములు అప్పగించేశారని, కానీ జగన్ సినీ పరిశ్రమ అభివృద్ధికి చిత్తశుద్ధితో ఉన్నారని ఆత్మసాక్షి ఘోషించింది.
వైసీపి ప్రభుత్వం సినీ పరిశ్రమని నియంత్రించడానికి పెట్టిన రకరకాల నిబందనలు, ఆంక్షలు దానికి మేలు చేయడానికే అని చెప్పుకోవడం విశేషం. చంద్రబాబు నాయుడు స్టూడియోల నిర్మాణానికి భూములు ఇస్తే నేరమని చెప్పిన కలంతోనే, జగన్మోహన్ రెడ్డి విశాఖలో సినీ స్టూడియోలు, అవసరమైతే సినీ ప్రముఖులు ఇళ్ళు నిర్మించుకోవడానికి కూడా భూములు ఇవ్వడానికి సిద్దంగా ఉన్నారని వ్రాయడం విశేషం.
ఏపీలో చిత్రపరిశ్రమ అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి కట్టుబడి ఉన్నందున ఈ మహత్తర అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలంటూ హితవు పలికింది.
కానీ ఏపీకి తెలుగు చిత్ర పరిశ్రమ ఎందుకు రావడం లేదో అందరికీ ఎలుసు. టిడిపి, జనసేనలు వైసీపికి రాజకీయ శత్రువులు. కనుక చిత్రపరిశ్రమలో చాలా మందికి వాటితో లేదా వాటి అధినేతలతో ప్రత్యక్షంగానో పరోక్షంగా బలమైన సినీ, రాజకీయ సంబంధాలు ఉన్నందున చిత్ర పరిశ్రమని కూడా వైసీపి ప్రభుత్వం శత్రువుగానే పరిగణిస్తోంది.
అందుకే అధికారం తమ చేతిలో ఉంది కనుక వైసీపి ప్రభుత్వం సినీ పరిశ్రమని రకరకాల నిబందనలు, ఆంక్షలతో వేదిస్తూనే ఉంది. ఈ వేధింపులు భరించలేక మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ పెద్దలనందరినీ వెంటబెట్టుకొని తాడేపల్లి వచ్చి ప్రాధేయపడేలా చేసి అవమానించింది. ఆ వీడియోలని మీడియాకు విడుదల చేసి మరోసారి అవమానించింది.
పైగా సినీ పరిశ్రమనుంచి కొందరికి సలహాదారు పదవులు, సినిమాలు తీసే అవకాశం కల్పించి వారిచేతనే సినీపరిశ్రమలో వారిని తిట్టిపోయిస్తోంది వైసీపి ప్రభుత్వం. కానీ నోటితో నవ్వుతూ నొసటితో వెక్కిరిస్తున్నట్లు తెలుగు సినీ పరిశ్రమతో ఓ పక్క చలగాటం ఆడుకొంటూనే, సినీ పరిశ్రమ ఏపీకి తరలిరావాలని జగన్ ఆహ్వానించడం విశేషం.
ఈ నేపధ్యంలో ఏపీలో తమ సినిమాల విడుదల, ప్రదర్శనలకే భయపడుతున్న సినీ ప్రముఖులు ఏపీకి రమ్మంటే వస్తారా? అందుకే తమను అక్కున చేర్చుకొని ఆదరిస్తున్న హైదరాబాద్ మెట్టింటిలోనే ఉండిపోయారు. వైసీపి ప్రభుత్వం వేధింపులకు భయపడే తెలుగు సినీ పరిశ్రమ ఆంధ్రాకు రావడం లేదని ఆత్మసాక్షికి కూడా తెలుసు. కానీ సినీ పరిశ్రమ అభివృద్ధికి జగన్ కట్టుబడి ఉన్నా ఒక్కరూ ఏపీకి రావడం లేదని బాధపడిపోయింది.
ఇంతకీ వైసీపికి ఆత్మసాక్షి వంటి సాక్షి మీడియాకి హటాత్తుగా సినీ పరిశ్రమపై ఎందుకు ప్రేమ పుట్టుకొచ్చిందో? హటాత్తుగా ఈ పిలుపులు దేనికో… చిన్న క్లూ ఇస్తే బాగుండేది కదా?అయినా ఇలాంటి రాతలు రాస్తే సినీ పరిశ్రమలో వారు, సినీ ప్రియులు, హీరోల అభిమానులు నవ్వుతారనే వెరుపు కూడా లేకపోవడం చాలా ఆశ్చర్యమే!




