ఊరించి, ఆశపెట్టి బిసిలకు మెుండి చేయి!

YS Jaganప్రముఖ పుణ్యక్షేత్రం టిటిడి బోర్డుకు కొత్త చైర్మన్ గా తిరుపతి యంయల్ఏ భూమన కరణాకర రెడ్డి ని ప్రభుత్వం నియమించింది. జగన్ మెూహన్ రెడ్డి సామాజిక న్యాయం విధానాలపై అవగాహన ఉన్న వారికి ఇది పెద్ద ఆశ్చర్యం కలిగించే విషయం కాదుకానీ, గత నెల రోజులుగా ఈ పదవిపై పత్రికల్లో వచ్చిన వార్తలు, మీడియా లీకులు చూసి పల్నాడు యంయల్సీ జంగా కృష్ణమూర్తి కి ఖరారైపోయుంది అనుకున్నారు. ఆయనకు మిత్రులు, అనుచరులు శుభాకాంక్షలు తెలిపారని కూడా మీడియాల్లో వచ్చింది. కనీసం ఎన్నికల కోసమైనా బిసిలకు ఇస్తారు, ఆయనకు కాకపోయినా మరో బిసి నాయకుడికైనా రావచ్చు అని మరికొంత మంది బిసి నాయకులు కూడా ఆశలు పెట్టుకున్నారు. వాళ్ళ ఆశలు వమ్ము చేస్తూ, తనదైన సామాజిక న్యాయం మార్కు కొనసాగిస్తూ మరొకసారి సొంత సామాజిక వర్గానికి కట్టబెట్టుకున్నారు.

వైసిపి ప్రభుత్వం వచ్చాక ఇది మూడొవ బోర్డు. మెదటి రెండు సార్లు తన సామాజిక వర్గానికి చెందిన వైవి సుబ్బారెడ్డి కి ఈ పదివి ఇచ్చారు. దాని మీద అప్పట్లో అనేక విమర్శలు వచ్చాయి. ఇప్పుడు మూడొవ సారి ఎన్నికల ముంగిట బోర్డును నియమించారు. ఇప్పటికే ఈ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు, మీడియా వేలకొద్దీ పదవులు సొంత కులానికి ఇచ్చారని ఆరోపణలు గుప్పిస్తూ వారి పేర్లతో సహా వెల్లడిస్తుంటే, ఆ విమర్శలకు ఏమాత్రం వెరపు లేకుండా మరోసారి సొంత కులం వ్యక్తికే పట్టంకట్టడం మరింత విమర్శలకు తావిచ్చింది.

ADVERTISEMENT

ఇప్పుడు ఈ విషయాన్ని గత ప్రభుత్వంతో పోల్చి చూస్తున్నారు. 2014లో టిడిపి అధికారంలోకి వచ్చినప్పుడు టిటిడి చైర్మన్ పదవిని ఆ పార్టీ సీనియర్ నాయకులు, అప్పటి యంపి రాయపాటి సాంబశివరావు బలంగా ఆశించారు. దైవ భక్తి మెండుగా ఉండి దేవాలయాలకు అనేక విరాళాలు ఇచ్చిన ఆయన అంతకు ముందు కాంగ్రేసులో ఉన్నప్పుడు కూడా ఆ పదవి కోసం ప్రయత్నించారు. మూడు సార్లు యంపిగా, కాంగ్రెస్ సీనియర్ నాయకులుగా ఉండి, హైకమాండ్‌ తో నేరుగా సంబంధాలు ఉన్న రాయపాటికి ఆ పదవి రావడం కష్టం కాకూడదు కానీ కాంగ్రేసులో ఉండే కొన్ని సామాజిక కారణాల వల్ల ఆయనకు ఆపదవి దక్కలేదు. కనీసం తెలుగుదేశంలో ఐనా తనకు టిటిడి చైర్మన్ దక్కుతుందని ఆశలు పెట్టుకున్నారు. కానీ చంద్రబాబు బలిజ వర్గానికి చెందిన చదలవాడ కృష్ణమూర్తికి ఆ పదవి ఇచ్చారు. చదలవాడ పదవీ కాలం ముగిసాక రాయపాటి మరోసారి ఆశించారు. తన రాజకీయ జీవితానికి ఇంకేమీ వద్దు, దేవుడికి సేవ చేసుకునే అవకాశం ఇవ్వండి చాలు అన్న విధంగా కూడా మాట్లాడే వారు. కానీ బాబు యధావిధిగా తన సొంత వర్గాన్ని పదవులకు దూరంగా ఉంచే అలవాటు కొనసాగించారు.

ఆ విడతలో కూడా బిసి వర్గానికి చెందిన పుట్టా సుదాకర్ యాదవ్ గారికి ఆ పదవి ఇచ్చారు. రాయపాటి ఎంత ఆశ పడ్డా చంద్రబాబును దగ్గర నుంచి గమనించే వారు మాత్రం ఆ పదవి బిసిలకు ఇస్తారని నమ్మకంగా ఉండేవారు. ఇక బిసి నేతగా ఎదుగుతున్న పుట్టా కు టిటిడి చైర్మన్ పదవి ఇచ్చాక అప్పటి ప్రతిపక్ష పార్టీ వైసిపి చేసిన రచ్చ మామూలుది కాదు. ఆయన తన నియెూజకవర్గ పరిధిలో ఒక క్రైస్తవ సభకు అతిథిగా వెళ్ళిన ఫోటోలు పెట్టి ఆయనను క్రైస్తవుడని ప్రచారం చేసారు. ఆయన ఆ విషయంపై వివరణ ఇచ్చుకున్నా వదలకుండా విమర్శించేవారు. అదే వైసిపి గతంలో నాస్తికుడుగా ఉండి, సొంత అల్లుడు క్రైస్తవుడైనా కరుణాకర రెడ్డికి ఇవ్వడాన్ని పలువురు ఇప్పుడు గుర్తు చేసి విమర్శిస్తున్నారు.

మామూలు సమయంలో పదవులు ఎలా కట్టబెట్టకున్నా, ఎన్నికల సంవత్సరంలో బిసిల ఓట్ల కోసమైనా బిసిలకు కొన్ని పదవులు ఇస్తారని ఆశించిన వైసిపిలోని బిసి నాయకులుకు ఊరించి ఊరించి చివరకు రిక్త హస్తం చూపించడంతో వాళ్ళు దీని మీద ఎలా స్పందించాలో కూడా తెలియక స్తబ్దుగా ఉండిపోయారు. పదవుల వరకు వచ్చేసరికి వైసిపి మార్కు రాజకీయం ఎలా ఉంటుందో వారికి మరోసారి తెలిసి వచ్చింది.

ADVERTISEMENT
Latest Stories