రానున్న ఎన్నికలకు పార్టీ నేతలకు, కార్యకర్తలకు జగన్ ఇచ్చిన నినాదం “వై నాట్ 175 “. 175 కి 175 సీట్లు మనకే రావాలి అనేది ఈ నినాదం యొక్క పరమార్ధం. అయితే ఇప్పుడు మరో విధానంలో ఇదే స్లోగన్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.వైసీపీ ప్రభుత్వం చేపట్టిన సామజిక సాధికార యాత్ర వేదికలు “వై నాట్ 175 ” స్లోగన్ బలాన్ని ప్రజలకన్నా ముందు ఆ పార్టీ అధినేత జగన్ కు అర్థమయ్యేలా చేస్తుంది.
వైసీపీ పార్టీ ఇంచార్జులు, స్థానిక నేతలు,పార్టీ నాయకులు, మంత్రులు అందరు కలిసి కట్టుగా ఈ యాత్రను విజయవంతం చేయడానికి బస్సులో ప్రచారానికి బయలుదేరి సభలు నిర్వహిస్తూ అక్కడి ప్రజలకు తమ సందేశాన్ని ఇస్తున్నారు. అయితే అక్కడ సభకు హాజరయ్యే ప్రజల కోసం సభా ప్రాంగణంలో వందల సంఖ్యలో కుర్చీలు వేస్తుంటే పదుల సంఖ్యలో ప్రజలు రావడం చర్చనీయాంశమయింది.
‘కొంపతీసి జగన్ చెపుతున్న ” వై నాట్ 175 సీట్లు” అంటే ఇవేనా?’ వైకాపా నేతలు నిర్వహించే సభలకు 175 సీట్లలో ప్రజలను నింపగలగితే చాలా…అంటూ సోషల్ మీడియాలో వైసీపీ పార్టీ మీద మీమ్స్ మొదలయ్యాయి. వైకాపా నేతలు నిర్వహించే సభలకు 175 సీట్లు ఫుల్ అవ్వడం లేదు కానీ 175 నియోజకవర్గాలలో వైసీపీ నాయకులు విజయం సాధించాలని, ఆ దిశగా పార్టీ నేతలు పనిచేయాలని జగన్ ఆశించడం అత్యాశే అవుతుందేమో అంటున్నారు నెటిజన్లు.
ఖాళీ కుర్చీలున్నా, ప్రజలలో వినే ఆసక్తి లేకున్నా, ప్రజల నుండి నిరసనలు వెలువడినా తమ అధినేతకు ఎదురుచెప్పకలేక యాత్రల పేరుతో ప్రజల మధ్య ఎదురీత చేస్తున్న వైసీపీ నేతలను మాత్రం అభినందించక తప్పదు. వైసీపీ నేతలు “వై నాట్ 175 “అంటే ఖాళీ కుర్చీలు దర్శనమిస్తున్న వీడియోలతో ఇవేనా మీ జగనన్న అడిగిన 175 సీట్లు అంటూ …,”జగనన్న వన్స్ మోర్” అంటే రాష్ట్రంలో వైకాపా నేతలు చేస్తున్న దాడుల వీడియోలతో ఇంకా మీ పార్టీకి మరో ఛాన్స్ కావాలా అంటూ వైకాపా నేతల నినాదాలకు సామజిక మాధ్యమాలలో నెటిజన్లు లెక్క సరిచేస్తున్నారు.






