ఏపీలో కాంగ్రెస్ పార్టీని నామరూపాలు లేకుండా చేసిన జగన్ మీద వ్యక్తిగతంగా, రాజకీయంగా కూడా ప్రతీకారం తీర్చుకునేందుకు, కాంగ్రెస్ పార్టీని పునరుద్దరించుకునేందుకు వైఎస్ షర్మిల సరైన వ్యక్తి అని కాంగ్రెస్ అధిష్టానం భావించింది. ఆవిధంగా జగన్ వదిలిన బాణం తిరిగి వచ్చి ఆయన గుండెల్లోనే గుచ్చుకుంది.
ఎన్నికలలో వైసీపీ ఓటమికి సవాలక్ష కారణాలలో ఆమె కూడా ఓ కారణమే. ఆమె తనపై తీవ్ర విమర్శలు చేస్తున్నా తిరిగి విమర్శించలేక, భరించలేక బహుశః జగన్ చాలా బాధపడుతుండవచ్చు.
కనుక ఆమెను వదిలించుకోవడానికి రాజ్యసభ ఎన్నికలు మంచి అవకాశంగా వచ్చాయి. కర్ణాటక సిఎం డీకే శివకుమార్తో జగన్కు సత్సంబంధాలున్నాయి. అక్కడ మూడు సీట్లు ఖాళీ అయ్యాయి. వాటిలో ఒకటి షర్మిలకే అని కాంగ్రెస్ అధిష్టానం ప్రామిస్ చేసింది కూడా.
కనుక జగన్ ఆయనతో మాట్లాడి చెల్లికి రాజ్యసభ సీటు దక్కేలా చేసి ఉండి ఉంటే ఆమె చెపుతున్నట్లు జగన్ దుర్మార్గుడు, దురాశపరుడు కాదని చెప్పుకునే అవకాశం ఉండేది. పైగా చెవిలో జోరీగలా ఆమె పోరు తప్పేది.
కానీ జగనే బెంగళూరులో ఉన్నప్పుడు చక్రం తిప్పి ఆమెకు టికెట్ దక్కకుండా అడ్డుకున్నారని సోషల్ మీడియాలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఒకవేళ అవి నిజమే అయితే ఇది మరొక రాజకీయ తప్పిదమే అవుతుంది.
ఇక ఇప్పట్లో ఆమెకు మరో అవకాశం దొరకదు. కనుక అప్పుడప్పుడు వచ్చి విమర్శించిపోతూనే ఉంటారు. లేదా ఆమె కాంగ్రెస్ పార్టీ మీద అలిగి పార్టీని వీడి, ఏపీలో కొత్త కుంపటి వెలిగిస్తే ఆ వేడి భరించడం ఇంకా కష్టం కదా?




