ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డికి వరుసగా ఊహించని సమస్యలు, సవాళ్ళు ఎదురవుతున్నాయి. ఆనాడు తాను సంధించిన బాణం వైఎస్ షర్మిల తెలంగాణ అంతా తిరిగి ఆయన గుండెల్లోనే గుచ్చుకోబోతోంది. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల, వైసీపి అధ్యక్షుడుగా జగన్మోహన్ రెడ్డి అన్నాచెల్లెళ్ళ మద్య త్వరలోనే రాజకీయ యుద్ధం జరుగబోతోంది.
ఇప్పుడు ఆమె ఇంట్లో శుభకార్యక్రమానికే జగన్మోహన్ రెడ్డి వెళ్ళవలసి రావడం ఇంకా ఇబ్బందికరమే. గురువారం సాయంత్రం హైదరాబాద్, గండిపేట వద్దగల గోల్కొండ రిసార్ట్స్ లో వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి, అట్లూరి ప్రియల వివాహ నిశ్చితార్ధం జరుగబోతోంది.
కనుక జగన్మోహన్ రెడ్డి ఈరోజు సాయంత్రం విమానంలో హైదరాబాద్ చేరుకుని వధూవరులను ఆశీర్వదించి వెంటనే బయలుదేరి తాడేపల్లి చేరుకుంటారు.
తనతో యుద్ధానికి సిద్దమవుతున్న చెల్లెలు షర్మిల ఇంటికి జగన్ వెళ్ళక తప్పని పరిస్థితి ఏర్పడింది. వెళ్ళకపోతే గిట్టనివారు చేసే వ్యాఖ్యలు భరించడం కష్టం. వెళితే చాలా ఇబ్బంది. అయినా తప్పదు కనుక వెళుతున్నారు. కనుక జగన్మోహన్ రెడ్డి ఓ అన్నగా, మేనమామగా వెళుతున్నారా లేక చివరి ప్రయత్నంగా రాజీ కోసం వెళుతున్నారా? అంటే రెండూ కాదనే చెప్పాలి.
ఇది వైఎస్ కుటుంబంలో జరుగుతున్న తొలి శుభ కార్యక్రమం. కనుక వైఎస్ షర్మిలకు అన్నగా, రాజారెడ్డికి మేనమామగా బంధుత్వాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లయితే భార్య భారతిని కూడా వెంటబెట్టుకుని జగన్ వెళ్ళేవారు. ఇద్దరూ అన్ని కార్యక్రమాలు చూసుకుని దగ్గరుండి వారి పెళ్ళి జరిపించేవారు. కానీ తప్పనిసరి పరిస్థితులలో జగన్ ఒక్కరే మొక్కుబడిగా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. అంటే లోకుల కోసమేనన్న మాట!
వైఎస్ షర్మిల కాంగ్రెస్లో చేరబోతున్నప్పుడే ఆమెను వారించేందుకు జగన్ తరపు వైవీ సుబ్బారెడ్డి తదితరులు చాలా ప్రయత్నించారు. కానీ ఈ అవకాశాన్ని జారవిడుచుకుంటే ఆమెకు రాజకీయ భవిష్యత్ ఉండదు. కనుక ఆమె వారి అభ్యర్ధనలు, వైసీపి ఆఫర్లు అన్నీ తిరస్కరించి కాంగ్రెస్లో చేరిపోయారు. అన్నతో యుద్ధానికి సిద్దపడే ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వస్తున్నారు. కనుక జగన్ ఈ కార్యక్రమానికి హాజరైనప్పటికీ వారి మద్య రాజీ కుదిరే అవకాశం లేదిప్పుడు.
ఎన్టీఆర్ కుటుంబంలో చిచ్చుపెట్టి ఆనందిస్తున్న జగన్మోహన్ రెడ్డికి తన ఇంటికి తానే నిప్పు పెట్టుకుని ఇప్పుడు బాధపడవలసివస్తోంది. అయిష్టంగానే చెల్లెలు ఇంటికి వెళ్ళవలసి వస్తోంది. ఈ దేవుడి స్క్రిప్ట్ ఇలా ఉందేమిటో?




