తండ్రి కనిపిస్తున్నారు.. తల్లి వచ్చింది.. తర్వాత చెల్లేనా?

ys-jagan-ys-vijayamma

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కుటుంబ సమేతంగా నేడు పులివెందులలో క్రిస్మస్ వేడుకలలో పాల్గొన్నారు. తల్లి విజయమ్మ చేత స్వయంగా కేక్ కట్ చేయించారు. ఆమె కూడా చాలా సంతోషంగా కేక్ కట్ చేసి కొడుకుని ముద్దు పెట్టుకొని ‘ఇకపై అంతా శుభం జరగాలని’ ఆశీర్వదించారు. వైఎస్ షర్మిల, ఆమె భర్త అనిల్ కుమార్‌ ఈ వేడుకలలో ఎక్కడ కనిపించలేదు కానీ వైఎస్ వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి మాత్రం జగన్‌ పక్కనే కనిపించారు.

ADVERTISEMENT

బంధు మిత్రులు, కుటుంబ సభ్యులు అందరూ కలిసి క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడం ఆనవాయితీ కనుక ఈ వేడుకలలో విజయమ్మ పాల్గొని ఉండవచ్చు. ఎంతైనా తల్లి కనుక కొడుకు చేసిన అవమానాలను మరిచి క్రిస్మస్ వేడుకలలో పాల్గొని ఉండొచ్చు. వారి ఫోటోలు సొంత మీడియాలో రాకపోతేనే ఆశ్చర్యపోవాలి కానీ వస్తే కాదు. కనుక జగన్‌-విజయమ్మల ఫోటోలు ప్రముఖంగా వచ్చాయి.

అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్‌కు తండ్రి అవసరం తీరిపోయింది. అందుకే తండ్రి భజన తగ్గించి సొంత డప్పు కొట్టుకునేవారు. అలాగే కష్టకాలంలో తల్లీ, చెల్లీ అందించిన తోడ్పాటుని కూడా జగన్‌ మరిచిపోయారు. మరో 30 ఏళ్ళు తానే ముఖ్యమంత్రిగా ఉండబోతున్నానని జగన్‌ గట్టిగా నమ్మారు కనుక ఇక వారిద్దరి అవసరం లేదనుకొని నిర్ధాక్షిణ్యంగా బయటకు గెంటేశారు.

కానీ ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయం తర్వాత జగన్‌కు వారి విలువ తెలిసి వచ్చిన్నట్లే ఉంది. అందుకే వైసీపీ సోషల్ మీడియాలో మళ్ళీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫోటోలు, ‘స్వీట్ మెమొరీస్’ కనిపించడం మొదలయ్యాయి.

అలాగే తల్లి అవసరం కూడా ఉందనుకున్నారో ఏమో మళ్ళీ ఆమెకు ప్రాధాన్యం ఇస్తూ క్రిస్మస్ కేక్ కట్ చేయించారు. ఇప్పుడు ఆమె జగన్‌ వైపే ఉన్నారని లోకానికి తెలియజేసేందుకు ఆమెతో దిగిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వేసుకున్నారు. మంచిదే.

కానీ ఆస్తి పంపకాల విషయంలో చెల్లితో గొడవలు పడినందున నేటికీ ఆమెని జగన్‌ దూరంగా పెట్టి ఉండొచ్చు.కానీ తల్లి విజయమ్మ ఈ అవకాశాన్ని వినియోగించుకొని వారిద్దరి మద్య రాజీకి ప్రయత్నించవచ్చు.

ధికారం కోల్పోయి లంకంత తాడేపల్లి ప్యాలస్‌లో జగన్‌ ఒంటరిగా మిగిలిపోయారు. కనుక ఇప్పుడు తల్లీ, చెల్లీ అవసరం ఎంతైనా ఉంది. కనుక ‘తల్లి మాటను కాదనలేక’ చెల్లితో కూడా ప్యాచప్‌కు సిద్దమైనా ఆశ్చర్యం లేదు.

వైఎస్ షర్మిల కాంగ్రెస్‌ అధ్యక్షురాలుగా ఏదో మాట్లాడుతూ కాలక్షేపం చేస్తున్నప్పటికీ, ఏపీలో కాంగ్రెస్‌ పార్టీ మళ్ళీ కొలుకునే సూచనలు కనబడటం లేదు. కనుక ఆమె పరిస్థితీ ఆగమ్యగోచరంగానే ఉంది. ఒకవేళ తల్లి ప్రయత్నాలు ఫలించి అన్న నుంచి పిలుపు వస్తే, ఆమె కూడా రాజీకి సిద్దపడే అవకాశం ఉంది. కనుక కొత్త సంవత్సరంలో జగన్‌ కుటుంబంలో పునరేకీకరణ జరుగుతుందేమో? జరిగితే మళ్ళీ రాష్ట్రంలో రాజకీయలెక్కలు మారుతాయి.

ADVERTISEMENT
Latest Stories