జగన్… నీకు పోయేకాలం వచ్చేసింది..!

paritala-sunithaరైతు భరోసా యాత్ర పేరిట అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి టీడీపీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడుపై సభ్యత, సంస్కారాలు మరిచి ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాడిపత్రి పరిధిలోని పెద్ద వడుగూరులో పర్యటించిన సందర్భంగా… చంద్రబాబును చెప్పుతో కొట్టాలని వ్యాఖ్యానించారు. చెప్పుతో కొడితే తప్ప చంద్రబాబుకు బుద్ధి రాదని సంచలన వ్యాఖ్యలు చేశారు జగన్. నవ నిర్మాణ దీక్షలో చంద్రబాబు చేయించిన ప్రతిజ్ఞను ప్రస్తావిస్తూ జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు.

“నవ నిర్మాణ దీక్షలో చంద్రబాబు చెప్పింది జరగాలంటే ప్రజలు చేయాల్సింది ఒక్కటే. ఎక్కడ కనిపిస్తే అక్కడ అవినీతి చంద్రబాబును చెప్పుతో కొట్టడమే. అప్పుడు తప్ప ఆయనకు బుద్ధి రాదు, గుడిని, గుడిలోని లింగాన్ని మింగే చంద్రబాబుకు అవినీతి గురించి మాట్లాడే అర్హత లేదని” జగన్ వ్యాఖ్యానించారు. “అమరావతి పరిధిలో భూములను పెట్టుబడిదారులకు తక్కువ ధరకు కట్టబెట్టారని, అలా సంపాదించిన అవినీతి సొమ్ముతో ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొంటున్నారని, తన పార్టీలో చేరిన ఇతర పార్టీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి తిరిగి గెలిపించుకునే దమ్ము, ధైర్యం చంద్రబాబుకు లేవని” జగన్ చేసిన వ్యాఖ్యలపై టిడిపి నేతలు కూడా అదే విధంగా స్పందించారు.

ADVERTISEMENT

“నీ సొంత నియోజకవర్గం పులివెందులకు నీళ్లిచ్చి వేలాది ఎకరాల పంటలను కాపాడి రైతులను ఆదుకున్నది నీ కంటికి కనబడదా? ఒకసారి రాళ్లతో కొట్టమన్నావు. ఇంకోసారి తునిలో విధ్వంసం సృష్టించావు. ఇప్పుడు చెప్పులతో కొట్టమంటున్నావు. ఇది నీ క్రిమినల్ మనస్తత్వానికి, రక్త చరిత్రకు పరాకాష్ట. మీ తాత రాజారెడ్డి వారసత్వం నిలబెట్టుకుంటున్నావా? ఎవర్ని చెప్పులతో కొట్టాలో 2014లో ప్రజలు కొట్టి చూపించారు, తిరిగి 2019లో కొట్టి చూపేందుకు సిద్ధంగా ఉన్నారు. సభ్యత, సంస్కారం లేకుండా అహంకారంతో జగన్ కొవ్వెక్కి మాట్లాడుతున్నాడు. ఇలాంటి వ్యక్తి ప్రతిపక్ష నేతగా ఉండటం కంటే దురదృష్టం మరొకటి ఉండదు” అంటూ మంత్రి పల్లె రఘునాధరెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

అలాగే, అనంతపురం జిల్లా తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా ఓ రేంజ్ లో జగన్ పై ధ్వజమెత్తారు. “నేను తలుచుకుంటే ఈ క్షణమే నిన్ను చెప్పులతో కొట్టించి తాడిపత్రి నుంచి తరిమివేయగలను. తాడిపత్రిలో రైతు భరోసా యాత్ర పేరిట పర్యటిస్తున్న నిన్ను పది నిమిషాల్లోనే ప్రజల చేత చెప్పులతో కొట్టిస్తే ఏం చేస్తావు? ముఖ్యమంత్రిని కాదు… ప్రజలు నిన్ను చెప్పులతో కొట్టి ఊరేగించే కాలం ఆసన్నమైంది” అని జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రిలో తన భావాలను బయటపెట్టారు.

అలాగే మరో మంత్రి పరిటాల సునీత మాట్లాడుతూ… “జగన్మోహన్ రెడ్డీ… మీకు పోయేకాలం కూడా దగ్గర కొచ్చిందన్న విషయాన్ని తెలుసుకోవాలి. ఎందుకంటే, మీరు జైలుకు మళ్లీ పోయి అక్కడ కూర్చోవాలి కాబట్టే, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గురించి మీరు మాట్లాడుతున్నారు. ఇదే విషయాన్ని ప్రజలు కూడా అనుకుంటున్నారు. నువ్వు మాట్లాడిన మాటలు ఎంత దారుణంగా ఉన్నాయి? ఒక ప్రతిపక్ష నాయకుడు మాట్లాడే మాటలా ఇవి? మా నాయకుడు చంద్రబాబు, మేము దరిదాపు పది సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నాము. ఏ రోజైనా, మీ నాయనను ఆ మాటలు అన్నామా? అంటూ విచక్షణ లేని జగన్ ను ఏకరువు పెట్టారు.

ఇలా వరుసపెట్టి ఒకరిద్దరూ కాదు, అంతా ముక్తకంఠంతో జగన్ వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. బహుశా తన ‘భరోసా యాత్ర’కు పబ్లిసిటీ కావాలని మాట్లాడారో లేక టిడిపి నేతలు ఆరోపిస్తున్నట్లు నిజంగానే జగన్ వద్ద సభ్యత, సంస్కారాలు లేవో గానీ, ఒక నాయకుడు మాట్లాడకూడని విధంగా మాట్లాడారని రాజకీయ విశ్లేషకులు కూడా జగన్ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరాలను వ్యక్తపరుస్తున్నారు. ఇలాంటి ప్రతిపక్ష నేత రాష్ట్రంలో ఉండడం ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం అని ఆరోపిస్తున్న టిడిపి నేతల మాటలను జగన్ తన చేతలతో మరింత బలపరుస్తున్నట్లుగా కనపడుతోంది.

ఒక ప్రతిపక్ష నేతగా ఉండి, సాక్షాత్తు ముఖ్యమంత్రిపైనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడంటే… అదే సిఎం హోదాలో ఉంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోవచ్చు. అవినీతికి, రౌడీ రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ గా పొలిటికల్ వర్గాలు జగన్ పేరును కీర్తిస్తుంటే, మరో పక్క చంద్రబాబును అత్యంత అవినీతి పరుడిగా జగన్ ‘ఒక వ్రేలు’ చూపించడం అనేది… మిగిలిన ‘నాలుగు వ్రేళ్ళు’ ఎటు వైపు చూపిస్తున్నాయో సదరు ‘యువనేత’ అర్ధం చేసుకుంటారా..? అర్ధం చేసుకునే సామర్ధ్యం ఉందంటారా..?

ADVERTISEMENT
Latest Stories