ఏ రాష్ట్రంలోనైనా అధికార ప్రతిపక్షాల మద్య ప్రజా సమస్యల పేరుతో రాజకీయ ఆధిపత్యపోరు సాగుతుంటుంది. కానీ ఏపీలో విచిత్రంగా కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల మద్య పోరు మొదలైంది.
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల శుక్రవారం విజయవాడలో మీడియా సమావేశం నిర్వహించి, అమ్మ ఒడి పధకం విషయంలో జగన్ మాట తప్పి ప్రజలను మోసగించారని ఆరోపించారు. పనిలో పనిగా టిడిపి, జనసేనల ఎన్నికల హామీల గురించి కూడా ప్రస్తావించి వాటిని ఎప్పుడు అమలుచేస్తారంటూ చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని కూడా నిలదీశారు.
వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలపై టిడిపి, జనసేనలు స్పందించలేదు కానీ వైసీపి అంతరాత్మ వంటి సాక్షి మీడియా వెంటనే స్పందించడం ఆశ్చర్యం కలిగిస్తుంది.
‘అమ్మ ఒడి’ పధకం గురించి వైఎస్ షర్మిల అసత్యాలు చెపుతున్నారని, ఆమె టిడిపి, జనసేన, బీజేపీల ప్రభుత్వంలో కనిపించని నాలుగో సింహం వంటివారని సాక్షి కనిపెట్టి చెప్పింది. హామీల అమలు గురించి చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన వైఎస్ షర్మిల, జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తూ టిడిపి కూటమి ప్రభుత్వాన్ని కాపాడే ప్రయత్నం చేస్తుండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తోందని సాక్షి పేర్కొంది.
నిజానికి ఏపీలో ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయిన వైఎస్ షర్మిలని, కాంగ్రెస్ పార్టీని వైసీపి దాని ఆత్మసాక్షి మీడియా పట్టించుకోవలసిన అవసరమే లేదు. కేవలం టిడిపి కూటమి ప్రభుత్వంతో పోరాడితే చాలు. కానీ వైఎస్ షర్మిల వ్యాఖ్యలపై వైసీపి వెంటనే స్పందించడం చూస్తే, ఆమె వలన వైసీపికి ప్రమాదం పొంచి ఉందని భావిస్తున్నట్లే ఉంది.
ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈసారి చంద్రబాబు నాయుడుని భారీ మెజార్టీతో గెలిపించారు. ఆయన కూడా వారి ఆకాంక్షల మేరకు పనులు మొదలుపెట్టారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కేవలం నెలరోజులే అయ్యింది. కనుక అప్పుడే ఆయన ప్రభుత్వాన్ని విమర్శించడం మొదలుపెడితే కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలలో మరింత వ్యతిరేకత పెరిగే అవకాశం ఉంటుందని వైఎస్ షర్మిలకు తెలుసు.
కానీ ఏపీ రాజకీయాలలో నిలద్రొక్కుకోవాలంటే రాజకీయాలలో యాక్టివ్గా ఉండక తప్పదు. అందుకోసమే ఆమె అన్న జగన్మోహన్ రెడ్డిని వైసీపిని టార్గెట్ చేసుకొని విమర్శలు గుప్పిస్తున్నట్లు భావించవచ్చు. ఈ అన్నా చెల్లెలి పోరాటంలో ఎవరు పైచేయి సాధిస్తారో రాబోయే రోజుల్లో చూడవచ్చు కానీ వారి పోరాటాలు ఏపీ ప్రజలకు రాజకీయ కాలక్షేపానికి మాత్రమే పనికి వస్తాయి.




