ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకి వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఎప్పుడూ ఎదురెదురుగా తారసపడరు. కానీ తొలిసారిగా వారిద్దరి మద్య సోషల్ మీడియా వేదికగా వాదోపవాదాలు జరిగాయి.
వైసీపీ అధినేత జగన్కి జైళ్ళకు వెళ్ళి పార్టీ నేతలను పరామర్శించడానికి సమయం ఉంటుంది కానీ శాసనసభ సమావేశాలకు వెళ్ళేందుకు సమయం ఉండదా? అని ట్వీట్ చేశారు.
ఓ మీడియా ప్రతినిధి ఆమె ట్వీట్ గురించి చెప్పి స్పందించమని అడిగితే, “ఆమెకు పనీపాటు లేదు. ఖాళీగా కూర్చొని ట్వీట్స్ వేస్తుంటారు. ఆమె ఏదో అడిగితే సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు,” అని జగన్ ఎందుకు శాసనసభకు వెళ్ళడం లేదనే ఆమె ప్రశ్నకు సమాధానం చెప్పకుండా తప్పించుకున్నారు.
‘పనీపాటు లేకుండా ఖాళీగా కూర్చున్నారు’ అనే బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలపై ఆమెకు బాగానే తగిలిన్నట్లున్నాయి. వెంటనే వాటికి ఘాటుగా బదులిస్తూ మరో పెద్ద మెసేజ్ పెట్టారు.
వైసీపీకి జగన్తో కలిపి 11 మంది ఎమ్మెల్యేలున్నారు. కానీ మాకు లేరు కనుక మేము శాసనసభకు వెళ్ళలేకపోతున్నాము. అయినప్పటికీ చంద్రబాబు నాయుడు హామీలపై నిలదీస్తూనే ఉన్నాము. కూటమి ప్రభుత్వం వైఫ్యల్యాలను ఎండగడుతూనే ఉన్నాము.
కానీ జగన్ శాసనసభకు వెళ్ళి కూటమి ప్రభుత్వాన్ని ఎన్నికల హామీలు, ప్రజా సమస్యలపై ఎందుకు నిలదీయడం లేదని అడిగితే సూటిగా సమాధానం చెప్పకుండా తిరిగి మమ్మల్ని విమర్శిస్తున్నారు.
ప్రజలు మీ అధినేత జగన్ని నమ్మి మీ పార్టీకి అధికారం అప్పగిస్తే 5 ఏళ్ళు కుంభకర్ణుడిలా నిద్రపోయారు. ఐదేళ్ళు రాష్ట్రాన్ని పందికొక్కులా దోచుకోవడం తప్ప ఏం చేశారు? ప్రజల సొమ్ముని మీ అధినేత జగన్ ప్యాలస్కు తరలించుకుపోయారు.
అధికారంలో ఉన్న 5 ఏళ్ళు పనిచేయకుండా దోచుకుతినడం వలననే ప్రజలు మీ పార్టీకి కనీసం ప్రతిపక్ష పార్టీ హోదా కూడా దక్కనీయలేదు.
ఒకవేళ శాసనసభకు వెళ్ళదలచుకోక పోతే 11 మంది మీ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసేయండి. ఇంట్లో కూర్చొని ప్రెస్మీట్లు పెట్టడానికి కాదు ప్రజలు మీకు 11 సీట్లు ఇచ్చింది,” అంటూ వైఎస్ షర్మిల ఘాటుగా బదులిచ్చారు.
సిఎం చంద్రబాబు నాయుడు పాలనలో రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, అవినీతి, అక్రమాలు పెరిగిపోయాయని, ప్రజలలో వ్యతిరేకత పెరిగిపోయిందని జగన్ నిత్యం వాదిస్తుంటారు.
కనుక అది నిజమని నిరూపించే అవకాశం జగన్కే ఉంది. షర్మిల చెప్పిన్నట్లు జగన్తో సహా 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామాలు చేసి మళ్ళీ పోటీ చేసి 11 సీట్లు గెలుచుకొని తమ వాదనలు నిజమే అని నిరూపించుకోవచ్చు కదా?లేదా ఆమె చెప్పిన్నట్లుగా శాసనసభ సమావేశాలకు హాజరయ్యి కూటమి ప్రభుత్వాన్ని నిలదీయవచ్చు కదా?
బొత్స సత్యనారాయణ @BotchaBSN గారి మాటలు వింటుంటే దెయ్యాలు వేదాలు వర్ణించినట్లుంది. నమ్మి అధికారం ఇస్తే ఖాళీగా ఉన్నదెవరో.. పని చేయకుండా రాష్ట్ర సంపదను పందికొక్కుల్లా దోచుకుతిన్నది ఎవరో… రాష్ట్ర ప్రజానీకానికి తెలుసు. 5 ఏళ్లు కుంభకర్ణుడి లెక్క నిద్ర పోయారు. అధికారం అనుభవిస్తూ…
— YS Sharmila (@realyssharmila) February 20, 2025




