ఏపీలో వైసీపీ నేతలకు ముఖ్యంగా సిఎం జగన్మోహన్ రెడ్డికి ఓ శుభవార్త! ఆయన సోదరి వైఎస్ షర్మిల తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని విలీనం చేసి అక్కడే రాజకీయాలు చేయబోతున్నారు. ఈవిషయం ఆమె స్వయంగా చెప్పారు.
ఈరోజు డాక్టర్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా హైదరాబాద్లో ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించిన తర్వాత ఆమె విలేఖరులతో మాట్లాడుతూ, “కాంగ్రెస్ పార్టీ మా తండ్రిగారిని గౌరవిస్తున్నందునే నేను సోనియా, రాహుల్ గాంధీలతో చర్చలకు వెళ్ళాను. తెలంగాణలో కేసీఆర్ని ఏవిదంగా గద్దె దించలానే దానిపైనే మేము ప్రధానంగా చర్చించాము. నేను ఇదే లక్ష్యంతో నిలబడి పోరాడుతా. ఇంతకాలం నా వెంట నడిచినవారిని కూడా నిలబెట్టి అందరం కలిసికట్టుగా పోరాడుతాము,” అని చెప్పారు.
నిలబడి పోరాడటం అంటే శాసనసభ ఎన్నికలలో నిలబడి పోటీ చేయడమే అని వేరే చెప్పక్కరలేదు. తెలంగాణ కాంగ్రెస్కు ఆమె వలన కలిగే లాభమేమిటో తెలీదు కానీ ఏపీలో వైసీపీకి, సిఎం జగన్మోహన్ రెడ్డికి ఆమె వలన తలనొప్పులు తప్పిపోయిన్నట్లే ఉన్నాయి. ఒకవేళ ఆమె ఏపీ కాంగ్రెస్లో చేరితే, జగనన్నపై ఆమె చేసే ఆరోపణలు, విమర్శలతో వైసీపీ తీవ్రంగా నష్టపోయి ఉండేది.
కానీ థాంక్ గాడ్! ఆ ప్రమాదం తృటిలో తప్పిపోయింది. ఇక జగన్ తలనొప్పులన్నీ రేవంత్ రెడ్డి నెత్తికి మారబోతున్నాయి.
“తెలంగాణ కాంగ్రెస్లో ఆమెకు చోటు లేదు… ఆమె అవసరం కూడా లేదని” రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగానే చెప్పారు. “ఏపీకి చెందిన వైఎస్ షర్మిలను తెలంగాణ కాంగ్రెస్లో చేర్చుకొని ఎన్నికలలో పోటీ చేయిస్తే కేసీఆర్ తెలంగాణ సెంటిమెంట్ రాజేసి కాంగ్రెస్ని దెబ్బ తీస్తారని” రేవంత్ రెడ్డి మొత్తుకొంటున్నా సోనియా, రాహుల్ వినలేదు.
ఆమె తెలంగాణ కాంగ్రెస్లో చేరబోతుండటమే కాకుండా తనకు, తన అనుచరులకు కూడా టికెట్లు ఇవ్వాల్సి ఉంటుందని చెపుతుండటం చూస్తే రేవంత్ రెడ్డికి అప్పుడే ఆమెతో కొత్త తలనొప్పులు మొదలైన్నట్లే ఉన్నాయి. రేవంత్ రెడ్డి ఇకపై ఆమెతో ఎలా వేగుతారో పాపం!



