ఈ అన్నాచెల్లెళ్ళకి కాస్త ఎవరైనా చెప్పండర్రా!

YS-Sharmila-YS-Jagan

ఏపీలో టిడిపి, జనసేన, బీజేపీల సంకీర్ణ ప్రభుత్వం అధికారం చేపట్టి ఇప్పుడే నెల రోజులైంది. జగన్‌ 5 ఏళ్ళలో చేయలేక చేతులెత్తేసిన పనులన్నీ సిఎం చంద్రబాబు నాయుడు ఒకటొకటిగా చక్కబెడుతున్నారు. అప్పుడే ఎన్నికల హామీల అమలుకు కసరత్తు మొదలుపెట్టారు కూడా.

ఏపీ అభివృద్ధి పనులపై సమీక్షా సమావేశాలు నిర్వహించి వాటికి కేంద్రం నుంచి నిధులు తెచ్చేందుకు గట్టిగా కృషి చేస్తున్నారు. సిఎం చంద్రబాబు నాయుడు నెల రోజులలోనే ఇన్ని పనులు చేస్తే, వైసీపి నేతలు, వారి మీడియా గత 5 ఏళ్ళలో తమ ప్రభుత్వ హయాంలో జరిగిన విధ్వంసం గురించి అప్పుడే మరిచిపోయి, చంద్రబాబు నాయుడు పాలన, ఆలోచనలు, నిర్ణయాలను తప్పు పడుతూ రోజూ విమర్శలు చేస్తూనే ఉన్నారు.

ADVERTISEMENT

ఇప్పుడు అన్నతో పాటు చెల్లి వైఎస్ షర్మిల కూడా విమర్శలు మొదలుపెట్టారు. చంద్రబాబు నాయుడు ఎన్డీయే కూటమిలో పెద్దన్న పాత్ర పోషిస్తూ, ఢిల్లీలో చక్రం తిప్పాల్సి ఉండగా ఢిల్లీ పెద్దల చుట్టూ ప్రదక్షిణాలు చేయాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు.

వారి ముక్కు పిండి విభజన హామీలని అమలుచేయించకపోగా, వారికి జీ హుజూర్ అంటూ ఎందుకు సలాములు చేస్తున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు పదేపదే ఢిల్లీకి వెళ్ళి వచ్చి రాష్ట్రానికి ఏం సాధించారని వైఎస్ షర్మిల ట్వీట్‌ చేశారు. కనీసం వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ ప్రయివేటీకరణ జరుగదని ఢిల్లీ పెద్దల చేత చెప్పించగలిగారా? అంటూ వైఎస్ షర్మిల చంద్రబాబు నాయుడుని దెప్పిపొడిచారు. బీజేపీకి అవసరం తీరిన తర్వాత సాయపడినవారిని కూడా మోసం చేస్తుందని కనుక దానిని నమ్మరాదని వైఎస్ షర్మిల హితవు పలికారు.

వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలుగా ఉన్నప్పటికీ, ఆ పార్టీకి ప్రజాధరణ లేదని మొన్న ఎన్నికలలోనే మరోసారి తేలిపోయింది. అయినా ఆమె రాజకీయాలలో కొనసాగాలనుకుంటున్నారు కానీ మరో 5 ఏళ్ళపాటు ప్రజల మద్య తిరగాలంటే చాలా శ్రమ, ఖర్చుతో కూడిన వ్యవహారం.

కనుక రాష్ట్రంలో ఏదైనా అనూహ్య రాజకీయ పరిణామాలు జరిగి మళ్ళీ అవకాశం లభించేవరకు ఈవిదంగా సోషల్ మీడియాలో కాలక్షేపం చేసుకోవచ్చు. ఆమె అన్న జగన్మోహన్‌ రెడ్డి కూడా అదే చేస్తున్నారిప్పుడు.

కేంద్రంలో చంద్రబాబు నాయుడు ఎంత కీలకం అయినప్పటికీ మోడీ ప్రభుత్వంపై కర్ర పెత్తనం చేయాలని ప్రయత్నిస్తే టిడిపితో పాటు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం కూడా నష్టపోతుంది. ఇప్పుడిప్పుడే మళ్ళీ కేంద్రంతో సత్సంబంధాలు ఏర్పడ్డాయి. రాజకీయంగా కూడా అనుకూల పరిస్థితి ఏర్పడింది.

కనుక కేంద్రం నుంచి నిధులు, ప్రాజెక్టులు రాబట్టుకోవడానికి కాస్త ఓర్పు, లౌక్యం చాలా అవసరం. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ఆవిదంగానే ముందుకు సాగుతున్నారని వైఎస్ షర్మిలకు తెలియదనుకోలేము. కానీ ముక్కు పిండి వసూలు చేయాలంటూ ప్రమాదకరమైన ఉచిత సలహా ఇస్తున్నారు.

బీజేపీని నమ్మరాదంటే, కాంగ్రెస్ పార్టీతో చేతులు కలపాలని సూచిస్తున్నారనుకోవాలేమో? ఎవరైనా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీతో కలిసి ఉండాలనుకుంటారు తప్ప అధికారంలో లేని పార్టీతో కాదు కదా?

ADVERTISEMENT
Latest Stories