ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రతీరోజూ జగనన్నకు ప్రేమతో ఒకటి రెండు డోసులు ఇస్తూనే ఉన్నారు. వాటిని ఆయన జీర్ణించుకోలేకపోవడం ఆయన సమస్య!
శనివారం వైఎస్ షర్మిల కాంగ్రెస్ నాయకులతో కలిసి ప్రకాశం జిల్లాలోని మద్దిపాడులోని గుండ్లకమ్మ ప్రాజెక్టుని సందర్శించారు. తర్వాత డైలీ కోటాలో భాగంగా ఆమె అన్నకు ఈరోజు డోస్ ఇచ్చేశారు.
“మా తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిగారి హయాంలో జలయజ్ఞంలో భాగంగా ఈ ప్రాజెక్టుని నిర్మిస్తే, ఆయన కుమారుడైన జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాజెక్టుకి ఓ పది కోట్లు కేటాయించి గేట్ల మరమత్తులు కూడా చేయించలేకపోయారు. నాన్నగారిలా గొప్పగొప్ప ప్రాజెక్టులు కట్టలేకపోయినా కనీసం ఆయన కట్టించిన ప్రాజెక్టుల గేట్లకు కూడా మరమత్తులు చేయించలేనప్పుడు, ఆయన వారసుడినని జగన్ ఎలా చెప్పుకోగలరు?
ప్రాజెక్టు నిర్వహణ చేయకపోవడం వలననే గుండ్లకమ్మ రెండు గేట్లు కొట్టుకుపోయాయని సాక్షాత్ ఎస్సీగారే చెపుతున్నారు. ఇదేనా మీ ప్రభుత్వ నిర్వాకం? వైఎస్ హయాంలో వెలిగొండ ప్రాజెక్టు పనులలో 70శాతం పూర్తయ్యాయి. మిగిలిన ఆ 30 శాతం పనులు కూడా చేయించలేని అసమర్ధ ప్రభుత్వం మీది.
అసలు మీ పార్టీ పేరు వైసీపిలోనే వైఎస్సార్ లేరు. వై అంటే వైవీ సుబ్బారెడ్డి, ఎస్ అంటే సాయిరెడ్డి (విజయ సాయిరెడ్డి), పి అంటే రామకృష్ణా రెడ్డి (సజ్జల రామకృష్ణా రెడ్డి). వారు ముగ్గురే మీ పార్టీని నడిపిస్తున్న మాట వాస్తవమా కదా?
వారు ముగ్గురినే మీరు వెంటపెట్టుకుని యుద్ధానికి ‘సిద్దం’ అంటే మేము కూడా సిద్దమే. ఏపీకి ప్రత్యేకహోదా, అమరావతి రాజధాని, విశాఖ రాజధాని, పోలవరం, విశాఖ స్టీల్ ప్లాంట్ దేని గురించి యుద్ధం చేద్దామో మీరే చెప్పండి. మేము సిద్దంగా ఉన్నాము,” అంటూ వైఎస్ షర్మిల అన్న జగన్మోహన్ రెడ్డికి సవాలు విసిరారు. దీనికి జవాబు నేడు భీమిలి సభలో చెప్తారేమో?




