రాజమౌళి బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి అంతర్జాతీయస్థాయి సినిమాలని 3-4 ఏళ్ళలో పూర్తిచేసేశారు కానీ వివేకా హత్య కేసు విచారణ మాత్రం ఎన్నేళ్ళయినా పూర్తవడం లేదు… తెలుగు సీరియల్లా అంతులేకుండా సాగిపోతూనే ఉంది. ఈ కేసులో తాజా పరిణామం ఏమిటంటే, 259వ సాక్షిగా పేర్కొనబడిన వైఎస్ షర్మిల నుంచి గత ఏడాది అక్టోబర్ 7న నమోదు చేసిన వాంగ్మూలాన్నిసీబీఐ ఈరోజు సీబీఐ కోర్టుకు సమర్పించింది.
దానిలో ఆమె పేర్కొన్నట్లు చెప్పబడుతున్న విషయం ఏమిటంటే, “వైఎస్ వివేకా హత్యకు కుటుంబ, ఆర్ధిక అంశాలు కారణాలు కావు. అంతకు మించి అంటే రాజకీయ కారణాలు ఉండి ఉండవచ్చు. అయితే ఇందుకు నావద్ద ఎటువంటి ఆధారాలు లేవు. బాబాయ్ వివేకానందరెడ్డి ఎన్నికలకు ముందు ఓసారి నావద్దకు వచ్చి నన్ను ఎంపీగా పోటీ చేయమని అడిగారు. ఎందుకంటే విజయమ్మ మీద పోటీచేసి ఓసారి ఓడిపోయారు. కనుక తనకు జగన్ టికెట్ ఇవ్వకపోవచ్చని ఆయన భావించారు. కానీ ఎట్టి పరిస్థితులలో అవినాష్ రెడ్డి పోటీ చేయకూడదని కోరుకొన్నందునే బాబాయ్ వివేకా నన్ను ఒప్పించే ప్రయత్నం చేశారు. ఆయనే స్వయంగా జగన్మోహన్ రెడ్డిని కలిసి నాకు టికెట్ ఇప్పిస్తానని చెప్పారు. జగన్ నాకు కూడా టికెట్ ఇవ్వరని భావించాను. అందుకే మొదట నేను ఒప్పుకోలేదు కానీ బాబాయ్ వివేకా గట్టిగా ఒత్తిడి చేయడంతో ఒప్పుకొన్నాను. మా కుటుంబంలో పైకి అంతా బాగున్నట్లే కనిపిస్తున్నా లోలోన కోల్డ్ వార్ సాగుతుండేది,” అని వైఎస్ షర్మిల వాంగ్మూలంలో పేర్కొన్నట్లు తెలుస్తోంది.
వివేకానందరెడ్డి హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐ ఛార్జ్ షీట్లో నిందితుడుగా పేర్కొంది. కనుక ఆగస్ట్ 14వ తేదీన తదుపరి విచారణకు హాజరు కావలసిందిగా సీబీఐ కోర్టు నోటీస్ పంపించింది.



