విశాఖ విమానాశ్రయంలోని క్యాంటీన్లో పనిచేస్తున్న శ్రీను అనే యువకుడు నాలుగేళ్ళ క్రితం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మీద కోడి కత్తితో దాడి చేస్తే భుజానికి స్వల్పగాయం అయ్యింది. నాలుగేళ్ళ క్రితమే జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కూడా జరిగింది. ఆ హత్యలో ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిలో కొందరు బయటే ఉంటే, కొందరు లోపల ఉంటూనే కేసును అనేక మలుపులు తిప్పుతున్నారు.
దాదాపు గత ఏడాది వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబు తన వద్ద డ్రైవరుగా పనిచేస్తున్న సుబ్రహ్మణ్యం అనే దళిత యువకుడిని హత్య చేసి శవాన్ని డోర్ డెలివరీ చేశాడు. ఆ కేసులో అనంతబాబు జైలుకి వెళ్ళి బెయిల్పై బయటకు వచ్చేశాడు కూడా.
వీటిలో కోడికత్తి కేసు కేవలం హత్యాప్రయత్నం కాగా మిగిలిన రెండూ దారుణమైన హత్యలే. కానీ కోడికత్తి కేసులో నిందితుడు శ్రీను మాత్రం అప్పటి నుంచి జైల్లోనే మగ్గుతుండటం విశేషం. అతనికి బెయిల్ లభించడం లేదు. ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు జరిపి దీని వెనుక కుట్రను బయటపెట్టాలని సిఎం జగన్మోహన్ రెడ్డి తరపు న్యాయవాది ఈ నెల 10వ తేదీన మళ్ళీ మరో పిటిషన్ వేశారు. అంటే ఆ రెండు హత్యల కేసుల కంటే ఇది చాలా తీవ్రమైనదని అనుకోవాలన్న మాట!
ఈరోజు విజయవాడలో ఎన్ఐఏ కోర్టులో ఆ పిటిషన్పై విచారణ జరిగింది. నిందితుడు తరపు న్యాయవాది ఈ కేసు నుంచి అతనికి విముక్తి కల్పించాలని ప్రయత్నించడం సహజమే కనుక ఆయన వాదనల గురించి చెప్పుకొనవసరం లేదు. కానీ ఎన్ఐఏ తరపున వాదించిన న్యాయవాది పీపీ విశాల్ గౌతమ్, ఈ కేసుపై సుదీర్గంగా చాలా లోతుగా దర్యాప్తు జరిపిన తర్వాత దీనిలో ఎటువంటి కుట్ర లేదని తేలిందని, బాధితుడు (జగన్మోహన్ రెడ్డి) ఆరోపిస్తున్నట్లు నిందితుడు శ్రీను టిడిపి అభిమాని, కార్యకర్త కాదని తేలిందని చెప్పారు. అలాగే విశాఖ విమానాశ్రయంలోని క్యాంటీన్ యజమాని హర్షవర్ధన్ ప్రసాద్కు ఈ కేసుతో ఎటువంటి సంబందం లేదని తేలిందని స్పష్టం చేశారు. కనుక ఈ కేసుపై ఇంకా ఎటువంటి దర్యాప్తు అవసరం లేదని కనుక కేసుపై తీర్పుని వెలువరించవలసిందిగా ఎన్ఐఏ న్యాయవాది పీపీ విశాల్ గౌతమ్ కోరారు.
కానీ సిఎం జగన్మోహన్ రెడ్డి తరపు న్యాయవాదులు తమ వాదనలు వినిపించేందుకు రెండు రోజులు సమయం కావాలని కోరడంతో ఈ కేసు తదుపరి విచారణను ఈనెల 17కి వాయిదా వేశారు. ఆ రోజునే తుది తీర్పు చెపుతామని కనుక ఈ కేసు విచారణ పొడిగింపు కోసం మళ్ళీ అభ్యర్ధించవద్దని న్యాయమూర్తి స్పష్టం చేశారు.
వివేకా హత్యను గుండెపోటు… సహజ మరణమని చిత్రీకరించడం మొదలుకొని ఆయన రెండో వివాహం, ఆస్తికోసం అల్లుడు చేసిన హత్య, పరాయి మహిళను లైంగికంగా వేధించడం వలన జరిగిన హత్య అంటూ అనేక కధలు చెపుతునే ఉన్నారు. ఆ కేసులో మొదట చంద్రబాబు నాయుడు ప్రమేయం ఉందని ఆరోపించిన వారే చివరికి ఇన్ని కొత్త కధలు చెపుతూ దీనిలో ఎటువంటి కుట్ర లేదని, తమను అన్యాయంగా ఇరికించాలని సీబీఐ ప్రయత్నిస్తోందని వాదిస్తున్నారు.
వివేకా హత్య కేసులో వైసీపీలో ఆరోపణలు ఎదుర్కొంటున్నవారు స్పందిస్తున్న తీరుకి, ఈ కోడికత్తి కేసులో స్పందిస్తున్న తీరుకు తేడా స్పష్టంగా కనిపిస్తోంది.
కోడికత్తి కేసులో చాలా పెద్ద కుట్ర దాగి ఉందని చెపుతున్నారు. కానీ ఈ కేసులో ఎటువంటి రాజకీయ కుట్రలు లేవని ఎన్ఐఏ స్పష్టంగా చెపుతోంది. అయినా ఈ కేసును ఇంకా ఎందుకు కొనసాగించాలనుకొంటున్నారు?అనే సందేహం కలుగుతుంది. ఎందుకంటే కోడికత్తి ఎన్నికల కోసమే ఆడిన డ్రామా అని టిడిపి మొదటి నుంచి వాదిస్తోంది. ఒకవేళ ఈ కేసులో ఎటువంటి కుట్ర లేదని కోర్టు కూడా తీర్పు చెప్పితే టిడిపి వాదనలు నిజమని రుజువవుతుంది. బహుశః అందుకే కేసు దర్యాప్తును కొనసాగించాలని కోరుకొంటున్నారేమో?



