YSR Congress Dream To Come To Power Again

ఓ రాజకీయ పార్టీ ఎన్నికలలో గెలవాలన్నా, అధికారంలో ఉన్న పార్టీ ఓడిపోయినా దానికి అనేక కారణాలు ఉంటాయి.

వాటిలో ఎక్కువ, తక్కువ ప్రభావం చూపే అనేక అంశాలు ఉంటాయి. ఉదాహరణకు 2024 శాసనసభ ఎన్నికలలో టీడీపీ, జనసేన, బీజేపిలు జత కట్టడం, చంద్రబాబు నాయుడుని జగన్‌ అరెస్ట్‌ చేయించి జైల్లో పెట్టించడం, జగన్‌కు అండగా నిలబడే కేసీఆర్‌ తెలంగాణలో ముందే ఓడిపోయి అధికారం కోల్పోవడం వంటి బలమైన కారణాలు కూటమి గెలుపుకి ఎంతగానో దోహదపడ్డాయి.

Also Read – అభివృద్ధి కనిపిస్తుంది…సంక్షేమం మొదలయ్యింది..!

దివంగత సిఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి మొహం చూసి జగన్‌ని నమ్మి ప్రజలు భారీ మెజార్టీతో గెలిపిస్తే, ఆయన అభివృధ్దికి బదులు సంక్షేమ పధకాల పేరుతో 5 ఏళ్ళు ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయడం, రాష్ట్రంలో అరాచక పరిస్థితులు సృష్టించడం, రాజకీయ కక్ష సాధింపులకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం వంటివి వైసీపీ ఓటమికి కారణాలుగా కనబడుతున్నాయి.

జగన్‌ తప్పులు చేస్తూ తన పార్టీ ఓటమికి బాటలు పరుచుకుంటుంటే, చంద్రబాబు నాయుడు ప్రజలను, ప్రతిపక్షాలను కలుపుకుపోతూ కూటమి విజయానికి బాటలు వేసుకున్నారు. కనుక ఒకరి వైఫల్యం మరొకరికి కలిసి వచ్చిందని అనుకోవచ్చు.

Also Read – ఇంకెంతమంది జ్యోతి మల్హోత్రాలున్నారో.?

కనుక వచ్చే ఎన్నికలలో ఇదే లెక్కన వైసీపీ-కూటమి జయాపజయాలు ఆధారపడి ఉంటాయి తప్ప, బెయిల్‌పై విడుదలైన గోరంట్ల మాధవ్ వంటి వైసీపీ నేతల పిల్లి శాపాలతో కూటమి ఓడిపోదు వైసీపీ గెలిచేయదు!

“ఈ తప్పుడు కేసులు, అరెస్టులకు భయపడే ప్రసక్తే లేదని వీటితో కూటమి ప్రభుత్వం తన వెంట్రుక కూడా పీకలేదని” గోరంట్ల మాధవ్ ఆవేశంగా చెప్పడం దేనికంటే, డర్టీ పిక్చర్ కారణంగా ఈసారి టికెట్ తిరస్కరించినప్పటికీ తాను జగన్‌కు వీర విధేయంగానే ఉన్నానని, జైలుకి వెళ్ళి వచ్చినా సిఎం చంద్రబాబు నాయుడుని ధైర్యంగా విమర్శిస్తున్నానని అధినేత జగన్‌కి గుర్తుచేసి కనీసం వచ్చే ఎన్నికలలో అయినా తనకు టికెట్ ఇస్తారనే ఆశతోనే అని వేరే చెప్పక్కర లేదు!

Also Read – ఉచితం సముచితం కాదు కానీ తప్పదుగా!

వచ్చే ఎన్నికలలో జగన్‌ ఆయనకు టికెట్ ఇస్తే ఈయవచ్చు కానీ వైసీపీ గెలుస్తుందా లేదా?అని రాజకీయ పరిస్థితిని వాస్తవ దృష్టితో చూసినట్లయితే కష్టమే అని అర్దమవుతుంది.

టీడీపీ, జనసేన, బీజేపిలు కలిస్తేనే ఎన్నికలలో వైసీపీ ఓడిపోతుందని జగన్‌ చాలా భయపడ్డారు. అలాగే జరిగింది కూడా.

ఇప్పుడు ఈ మూడు పార్టీల మద్య బంధం మరింత బలపడింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మద్య, కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు-పవన్ కళ్యాణ్‌ల మద్య సత్సంబంధాలు నెలకొని ఉన్నాయి.

ఈసారి ఎట్టి పరిస్థితులలో అమరావతి, పోలవరం, వైజాగ్, విజయవాడలో మెట్రో, భోగాపురం విమానాశ్రయం వంటివన్నీ పూర్తిచేసి ప్రజలకు చూపించి ఓట్లు అడగాలని సిఎం చంద్రబాబు నాయుడు చాలా పట్టుదలగా ఉన్నారు.

రాష్ట్రానికి భారీగా పరిశ్రమలు, పెట్టుబడులు సాధించి, పెద్ద ఎత్తున ఉద్యోగాల కల్పనకు ప్రయత్నిస్తున్నారు. కనుక వచ్చే ఎన్నికలనాటికి కూటమి ప్రభుత్వం మరింత బలపడే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి తప్ప బలహీనపడి ఓడిపోయే అవకాశం కనిపించడం లేదు.

కనుక జగన్‌తో సహా వైసీపీ నేతలందరూ ‘మళ్ళీ మనమే’ అంటూ పగటి కలలుకంటూ కళ్ళు మూసుకుంటే చాలు.. మరో 9 ఏళ్ళు ఇట్టే గడిచిపోతాయి.