వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి గురువారం మధ్యాహ్నం ఓ వీడియో సందేశం విడుదల చేశారు. బహుశః అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళేందుకు మానసికంగా సిద్దపడి పంపిన్నట్లున్నారు. ఎందుకంటే, ఆయన చెప్పుకొంటున్నట్లు ఈ హత్యతో ఎటువంటి సంబందమూ లేకపోతే సీబీఐని ధైర్యంగా కోర్టులో ఎదుర్కొని న్యాయపోరాటం చేసి తన వాదనలు వినిపించి నిర్ధోషిత్వాన్ని నిరూపించుకొని ఉండేవారు. కానీ ముందస్తు బెయిల్ కోసం పోరాడుతున్నారు. సీబీఐ మీద, వివేకా కూతురు అల్లుడు మీద, చివరికి ఏ సంబందమూ లేని చంద్రబాబు నాయుడు మీద ఆరోపణలు చేస్తున్నప్పుడు వాటిని కోర్టులో నిరూపించవచ్చు కదా? కానీ ఆయన ప్రజలకు తన వాదనలు వినిపిస్తున్నారు!
దాంతో ఆయన సాధించేదేమిటి?ప్రజల సానుభూతి పొందడం కోసం. ఈ కేసులో తాను అన్యాయంగా బలి పశువునయ్యానని ప్రజలను నమ్మించడం కోసం. కానీ ఆయన నిర్ధోషి అని న్యాయస్థానం నమ్మనప్పుడు ఇలాంటి వాదనలు ఎన్ని చేసినా ప్రయోజనం ఉండదు. అయినప్పటికీ చివరి ప్రయత్నంగా ప్రజలకు ఓ వీడియో సందేశం పంపారు.
దానిలో ఆయన ఏమన్నారంటే “ఆరోజు వివేకానంద రెడ్డి హత్య జరిగిన రోజు ఏం జరిగిందనేది ప్రజలకు కూడా తెలియాలి. ఆ రోజు ఉదయం 6.30 గంటలకి శివప్రకాశ్ రెడ్డి నాకు ఫోన్ చేసినప్పుడు నేను పులివెందుల నుంచి కారులో జమ్మలమడుగు వెళుతున్నాను. బావ చనిపోయాడు వెంటనే అక్కడకు వెళ్ళమని చెప్పగానే నేను అక్కడ చేరుకొన్నాను. అక్కడ ఉన్న కృష్ణారెడ్డి (వివేకా పీఏ) బాత్ రూములో సార్ శవం ఉందని చెపితే లోనికి వెళ్ళి చూసాను. బయటకు వచ్చే ముందు ఏమైనా అనుమానాస్పదంగా ఉందా?అని నేను కృష్ణారెడ్డిని అడిగితే లేదన్నారు. అయితే మేము అక్కడికి చేరుకోక ముందే అక్కడ వివేకా ఉపయోగించే మొబైల్ ఫోన్, ఓ లేఖ ఉందని కృష్ణారెడ్డి వివేకా అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డికి ఫోన్ చేసి చెప్పారు. ఆయన వాటిని తీసి దాచిపెట్టేయమని చెప్పారు.
వివేకా చనిపోయే ముందు వ్రాసిన దానిలో ఏముందంటే, నేను డ్రైవర్ ప్రసాద్ను త్వరగా డ్యూటీకి రావాలని చెప్పినందుకు నన్ను చచ్చేలా కొట్టాడు. ఈ లెటర్ వ్రాయడానికి నేను చాలా కష్టపడ్డాను. డ్రైవర్ ప్రసాద్ని ఎట్టి పరిస్థితులలో వదిలిపెట్టొద్దు… ఇట్లు వివేకానంద రెడ్డి అని వ్రాసి ఉంది. ఆయన హత్య కేసులో ఈ లేఖే చాలా కీలకం. కానీ దానిని రాజశేఖర్ రెడ్డి దాచి పెట్టమన్నాడు. ఎందుకని అడిగితే డ్రైవర్ ప్రసాద్ చాలా మంచివాడు. అతని గురించి ఎవరైనా ఏమనుకొంటారో అని దాచి పెట్టమని చెప్పానన్నారు. అంటే వివేకాను కంటే డ్రైవర్నే ఎక్కువ నమ్ముతారా?
ఇక ఈ కేసును దర్యాప్తు చేసిన సీబీఐ అధికారి కూడా రాంపాల్ సింగ్ కూడా అటువంటి లేఖ ఏమీ లేదని చెప్పి ఈ రహస్యాన్ని దాచిపెట్టాలని ప్రయత్నించారు. సునీత పదేపదే తన స్టేట్మెంట్స్ మార్చుకొనేందుకు కూడా అవకాశం కల్పించారు. వారిని కాపాడేందుకు సీబీఐ అధికారి ఎందుకు ప్రయత్నిస్తున్నారు? నన్ను కుట్రపూరితంగా ఇరికించేందుకు ఎందుకు ప్రయత్నిస్తున్నారు?”అంటూ అవినాష్ రెడ్డి ఆ సందేశంలో పాడిందే పాచిపాట మళ్ళీ పాడారు.
అయితే ఆయన విడుదల చేసిన ఈ వీడియో సందేశంలోనే తాను వివేకా ఇంట్లోకి వెళ్ళి బాత్ రూములో నిర్జీవంగా పడి ఉన్న ఆయనను చూశానని చెప్పారు. మళ్ళీ బయటకు వచ్చి ఏమైనా అనుమానాస్పదంగా ఉందా? అని కృష్ణారెడ్డిని అడిగానని చెప్పారు. లోపలకి వెళ్ళినప్పుడు దారుణంగా హత్య చేయబడిన వివేకాను చూసి వచ్చాక ఏమైనా అనుమానాస్పదంగా ఉందా? అని ప్రశ్నించడం ఏమిటి?
అక్కడ లెటర్, ఫోన్ ఉన్నాయని చెపుతున్నప్పుడు పోలీసులు వాటిని ఎందుకు స్వాధీనం చేసుకోలేదు?అయినా అన్ని గొడ్డలి పోట్లు అదీ తల వెనుక భాగంలో పడిన తర్వాత ఏ వ్యక్తి అయినా పెన్ను కాగితం వెతికి తెచ్చుకొని లేఖ వ్రాయగలరా?అసలు సునీతా దంపతులను వెనకేసుకురావడానికి వారేమైనా సీబీఐ అధికారి రాంసింగ్ బందువులా స్నేహితులా? ఆయన అవినాష్ రెడ్డిపై కక్ష కట్టడానికి వారిద్దరికీ మద్య ఆస్తితగాదాలు లేదా రాజకీయ కక్షలు ఉన్నాయా? లేవు కదా? అవినాష్ రెడ్డి స్వయంగా విడుదల చేసిన వీడియో సందేశంలోనే ఇన్ని సందేహాలున్నాయి కదా?వీటికి ఏం సమాధానం చెపుతారో?



