పోలింగ్ సరళి చూసినప్పుడే వైసీపి నేతలందరి నోళ్ళు మూతపడ్డాయి. ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ చూసిన తర్వాత ఎవరికీ నోరు పెగలడమే లేదు. సజ్జల రామకృష్ణా రెడ్డి కాస్త ధైర్యం చేసి మీడియా ముందుకు వచ్చి “మాది పాజిటివ్ అజెండా… పాజిటివ్ థింకింగ్…పాజిటివ్ ప్రచారం… కనుక రిజల్ట్స్ కూడా పాజిటివ్గానే ఉండబోతున్నాయి…
రాష్ట్రంలో సైలంట్ ఓటింగ్ జరిగింది… ఈ విషయం ఎవరికీ అర్దం కాలేదని సజ్జల చెపుతున్నప్పుడు మొహంలో మేమే గెలవబోతున్నామనే ఆనందం కనిపించాలి కదా? కానీ ఏడుపు ఒక్కటే తక్కువ అన్నట్లుంది. గెలిచేవాడు ఎవడూ అలా ఏడుపు మొహం పెట్టుకొని గెలుస్తామని చెప్పుకోడు కదా?
మరో విషయం ఏమిటంటే, ఈసారి ఎన్నికలలో 175/25 సీట్లు మావే అని గొప్పలు చెప్పుకున్న జగన్ కూడా సరిగ్గా నిన్న ఉదయమే విదేశాల నుంచి విజయవాడ తిరిగివచ్చారు. తాడేపల్లి ప్యాలస్లో అడుగు పెట్టిన కొన్ని గంటలకే ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. అవన్నీ ఈసారి వైసీపి ఓడిపోబోతోందని తేల్చి చెప్పేశాయి.
దీంతో ఇప్పుడు జగన్ కూడా ప్రజలకు, ముఖ్యంగా “నువ్వే మా నమ్మకం… నువ్వే మా భవిష్యత్…” అని బలవంతంగా కోరస్ పాడించిన మంత్రులు, ఎమ్మెల్యేలకు మొహం చూపించలేని పరిస్థితి! రేపటి నుంచి మా భవిష్యత్ ఎవరు జగన్? అని అందరూ ప్రశ్నిస్తే ఏమని సమాధానం చెప్పుకోవాలి?
అదే… జూన్ 5 వరకు విదేశాలలోనే కాలక్షేపం చేసి ఉండి ఉంటే, తిరిగి వచ్చేసరికి వైసీపి నేతలు ఎవరి దారి వారు చూసుకొని ఉండేవారు కదా?ఇలా… వారిని చూసి జగన్, ఆయనను చూసి వారు బాధపడక్కరలేదు కదా?
పైగా ‘జూన్ 9న ఉదయం 9.38 గంటలకు విశాఖలో ప్రమాణస్వీకారం’ అంటూ చాలా హడావుడి కూడా చేశారు. మరిప్పుడు జనాలు నవ్వుకోరు?
ఓ వైపు ఏమాత్రం కృతజ్ఞత లేని ‘మేలు’ పొందిన జనాలు, మరోవైపు కత్తి కట్టిన టిడిపి, జనసేన నేతలు ముసిముసి నవ్వులు నవ్వుతుంటే భరించగలమా?బాబోయ్ ఈ బాధ పగవాడికి కూడా రాకూడదు. అయినా అందరికీ ‘మేలు’ చేసేవాడికే ఈ కష్టం రావాలా? అర్జునుడు, పద్మవ్యూహం, సింగిల్ సింహం… అన్నీ ఏమైపోయాయి?




