సర్వేలతో వైసీపీ సంతోషంగానే ఉందా?

YSR Congress Party latest Surveysఉగాదినాడు అధికార, ప్రతిపక్షాలు చెప్పించుకొనే పంచాంగాలకు, సర్వేలకు మద్య ఇప్పుడు పెద్దగా తేడా ఉండటం లేదిప్పుడు. ఎవరి పంచాంగం వారిదే అన్నట్లు ఎవరి సర్వేలు వారివే అన్నట్లు తయారవుతున్నాయి. ఎందుకంటే రాజకీయ పార్టీలు సర్వేలను కూడా తమ రాజకీయ వ్యూహంలో భాగంగా భావిస్తుండటంతో సర్వేలు తయారవుతున్నాయి.

ఇటీవల కొన్ని మీడియా సంస్థలు సర్వే చేసి ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మళ్ళీ భారీ మెజార్టీతో వైసీపీయే అధికారంలోకి వస్తుందని తేల్చి చెప్పాయి. కానీ గడప గడపకి వెళుతున్న మంత్రులు, ఎమ్మెల్యేలకు ప్రజల నుంచి ఎదురవుతున్న ఛీత్కారాలు, చేదు అనుభవాలను చూస్తున్నప్పుడు, ఈ సర్వేలలో నిజమెంత?అని అనుమానం కలుగకమానదు. ఒకవేళ ఆ సర్వేలు నిజమనుకొంటే, వైసీపీ నేతలకి ప్రజలు నీరాజనాలు పట్టాలి కదా?కానీ అలా జరగడం లేదంటే సర్వేలు సొంత పంచాంగం వంటివే అని అర్దమవుతోంది.

ADVERTISEMENT

అయితే వైసీపీ వాస్తవ పరిస్థితి ఏమిటి? అనే ప్రశ్నకు ఎన్నికల వ్యూహ నిపుణుడు ప్రశాంత్ కిషోర్‌కి చెందిన ఐప్యాక్ సమాధానం చెపుతుంది. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలలో కనీసం 60-75 మందిపై ప్రజలలో తీవ్ర వ్యతిరేకత ఉందని, వారు ఎన్నికలలో గెలవడం కష్టమని, కనుక వారిని మార్చకతప్పదని తేల్చి చెప్పింది.

ఇక సిఎం జగన్మోహన్ రెడ్డి సొంతంగా చేయించుకొన్న సర్వేలలో కనీసం 50-60 మంది ఎమ్మెల్యేల పనితీరు అసలు బాగోలేదని, ప్రజలలో వారిపట్ల వ్యతిరేకత ఉందని తేలినట్లు సమాచారం. అందుకే ఎమ్మెల్యేలందరూ పనితీరు మెరుగుపరుచుకోవాలని లేకుంటే టికెట్లు ఇవ్వనని, మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు అందరూ గడప గడపకి కార్యక్రమంలో తప్పనిసరిగా పాల్గొనాలని సిఎం జగన్ హెచ్చరించిన సంగతి అందరికీ తెలుసు. కానీ గడప గడపకి కార్యక్రమం ఎంత రసాభాసగా సాగుతోందో రోజూ మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి.

గుంటూరు జిల్లా తాడికొండలో డొక్కా మాణిక్యవరప్రసాద్‌ను వైసీపీ అదనపు ఇన్‌ఛార్జిగా నియమించడంతో వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి తన అనుచరులతో కలిసి జిల్లా వైసీపీ ఇన్‌ఛార్జి మేకతోటి సుచరిత ఇంటి ముందు ధర్నా చేశారు. వచ్చే ఎన్నికలలో పార్టీ తనను పక్కన పెట్టి డొక్కాకు టికెట్ ఇవ్వబోతోందని గ్రహించినందునే వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవి ఆందోళనకు గురవుతున్నారని అర్దమవుతూనే ఉంది.

అయితే ఇది తాడికొండకే పరిమితమవలేదు. కృష్ణా, నెల్లూరు, అనంతపురం, చిత్తూరు తదితర జిల్లాలలో వైసీపీ నేతలు టికెట్ల కోసం సిగపట్లు పడుతుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. కనుక సర్వేలతో ప్రజలను మభ్యపెట్టినప్పటికీ వైసీపీ వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉందని అర్దమవుతూనే ఉంది. మరి సిఎం జగన్ వచ్చే ఎన్నికలలో ఎంతమంది సిటింగ్ ఎమ్మెల్యేలని పక్కన పెడతారో, కొత్త బ్యాచ్‌తో ఏవిదంగా ఎన్నికలలో నెగ్గుకువస్తారో చూడాలి.

ADVERTISEMENT
Latest Stories