అవి పంచాయితీ ఎన్నికలు కావచ్చు.. మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికలు కావచ్చు… ప్రతీ ఎన్నికలనీ రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా భావిస్తుండటం, జిల్లా, పట్టణ, గ్రామస్థాయిలో రాజకీయంగా పైచేయి సాధించిన్నట్లు భావిస్తుండటంతో అధికార, ప్రతిపక్షాల నేతలు, కార్యకర్తల మద్య ఘర్షణలు, అవాంఛనీయ సంఘటనలు సర్వసాధారణమైపోయాయి.
రాష్ట్రంలో ప్రశాంతంగా ఉండే నియోజకవర్గాలలో కాకినాడ జిల్లాలోని తుని కూడా ఒకటి. తుని మున్సిపాలిటీలో మొత్తం 30 మంది కౌన్సిలర్లున్నారు. వారిలో కొంత మంది టీడీపీలో చేరిపోయారు. దీంతో మున్సిపల్ వైస్ ఛైర్మన్ పదవిని దక్కించుకోవడం కోసం టీడీపీ, వైసీపీ నేతలు గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి.
ఇప్పటికే వైస్ ఛైర్మన్ ఎన్నిక కోరం లేక రెండుసార్లు వాయిదా పడింది. మాజీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా వైసీపీ కౌన్సిలర్లను కౌన్సిల్ సమావేశానికి రానీయకుండా రహస్య ప్రదేశంలో బందించి ఉంచారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వారందరూ టీడీపీకి అనుకూలంగా ఓట్లు వేస్తారనే భయంతోనే సమావేశానికి రాకుండా దాచిపెట్టారని ఆరోపిస్తున్నారు.
మాజీ మంత్రి కన్నబాబు, మాజీ ఎమ్మెల్యేలు దాడిశెట్టి రాజా, ద్వారంపూడి, కాపు నేత ముద్రగడ పద్మనాభరెడ్డి, వైసీపీ నేతలు వంగా గీత, జక్కంపూడి రాజా తదితరులు ‘ఛలో తుని’ అంటూ బయలుదేరారు. పోలీసులు ఎక్కడికక్కడ వారిని గృహ నిర్బందం చేసి, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ముందస్తు జాగ్రత్త చర్యగా తుని పట్టణంలో మంగళవారం ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు కర్ఫ్యూ విధించాల్సి వచ్చింది.
టీడీపీ, వైసీపీలలో దేనికి సభ్యుల మద్దతు ఉంటే దానికే మున్సిపల్ వైస్ ఛైర్మన్ పదవి లభిస్తుంది. తమకు ఉందని వైసీపీ భావిస్తోంది. కనుక సమావేశానికి వచ్చి అది నిరూపించుకుంటే హుందాగా ఉండేది. కానీ ఈ ఎన్నిక పేరుతో వైసీపీ నాయకులు బయలుదేరి రాజకీయ బలప్రదర్శన చేయాలనుకోవడమే తప్పు.. కదా?




