2019 ఎన్నికలలో అనేక సానుకూల అంశాలు, శక్తులు కలిసి రావడంతో వైసీపీ భారీ మెజార్టీతో ఘనవిజయం సాధించింది. ఈసారిఎన్నికలలో రాష్ట్రంలో మొత్తం అన్ని సీట్లు అంటే… 175 శాసనసభ, 25 లోక్సభ సీట్లను మేమే గెలుచుకొంటామని జగన్ పదేపదే చెపుతున్నారు. అంటే గత ఎన్నికల కంటే ఈసారి వైసీపీకి మరింత సానుకూల వాతావరణం, కలిసివచ్చే శక్తులు ఉన్నాయా?అంటే కాదనే చెపొచ్చు.
వైసీపీని ప్రజలు కనీవినీ ఎరుగని భారీ మెజార్టీతో గెలిపిస్తే, ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయింది. అమరావతి, పోలవరం, ఆర్ధికాభివృద్ధి, పారిశ్రామికాభివృద్ధి, మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించాల్సిన జగన్ ప్రభుత్వం, వాటన్నిటినీ పక్కనపడేసి తొలి రోజు నుంచే ఓటు బ్యాంక్ రాజకీయాలు మొదలుపెట్టేసింది.
దాని కోసం సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థలను సృష్టించింది. దాని కోసమే లక్షల కోట్లు అప్పులు తెచ్చి మరీ సంక్షేమ పధకాలు అమలుచేస్తోంది. ఈ కారణంగా ప్రజలపై పన్నులు, చార్జీల భారం పెంచేస్తోంది. టిడిపి, జనసేనలను ఉక్కుపాదంతో అణచివేసేందుకు ప్రయత్నిస్తోంది.
ఈ కారణాల వలన ఆంధ్రా ప్రజలలో జగన్ ప్రభుత్వం పట్ల విముఖత బాగా పెరిగిపోయింది. మరోపక్క టిడిపి, జనసేన, బిజెపిలు మళ్ళీ కలిసి పనిచేసేందుకు సిద్దం అవుతున్నాయి. కలిసి పనిచేయకపోయినా ఈసారి ఎట్టి పరిస్థితులలో జగన్ను గద్దె దించడమే లక్ష్యంగా పనిచేయబోతున్నాయి. అంటే జగన్కు వ్యతిరేకంగా రాజకీయ శక్తులు ఏకం అవుతున్నాయన్న మాట!
అంటే 2019 ఎన్నికలకు ముందు టిడిపికి ఎటువంటి వ్యతిరేక పరిస్థితులు నెలకొని ఉన్నాయో, ఇప్పుడు వైసీపీకి కూడా సరిగ్గా అటువంటి పరిస్థితులే ఉన్నాయని స్పష్టమవుతోంది. అయినా ఈసారి ఏకంగా 175 సీట్లు మేమే గెలుచుకొంటామని జగన్ చెపుతున్నారు!!!
తెలంగాణ సిఎం కేసీఆర్ తన రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి, సంక్షేమ పధకాలు కూడా ఇస్తున్నా కూడా అన్ని సీట్లు మేమే గెలుచుకొంటామని చెప్పుకోవడం లేదు. కానీ ఏమీ చేయకుండానే, వ్యతిరేక పరిస్థితులలో 175 సీట్లు గెలుచుకొంటామని జగన్ చెప్పుకొంటున్నారు. ఎలా సాధ్యం?సాధ్యం కానప్పుడు పదేపదే నమ్మకంగా ఎందుకు చెపుతున్నట్లు?
అంటే ఈ అబద్దాన్ని పదేపదే గట్టిగా నొక్కి చెపుతూ నిజమని ప్రజలను నమ్మించవచ్చని కావచ్చు. పార్టీ పరిస్థితి పార్టీలో అందరికీ తెలుసు కనుక మనమే గెలుస్తామనే భ్రమింపజేస్తూ వారు పక్క చూపులు చూడకుండా పట్టి ఉంచుకొనేందుకు కావచ్చు. సంక్షేమ పధకాలు ఓట్లు రాలుస్తాయనే బలమైన నమ్మకం కావచ్చు. ఈ నాలుగేళ్ళలో ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయడానికి తమ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలిస్తాయనే నమ్మకం కావచ్చు. అయితే వీటిలో సంక్షేమ పధకాలు తప్ప మిగిలినవన్నీ ఊహాజనితమైన లెక్కలే అని అర్దమవుతూనే ఉంది.
వైసీపీ నేతలందరూ కూడా తమ అధినేత ఫోటోతో మాత్రమే గెలవగలమని భావిస్తున్నారు. కనుక వారు కూడా ఆయనకు వంతపాడక తప్పడం లేదు. అందుకే వైసీపీలో అందరూ కల్సీ మేకపోతు గాంభీర్యం ప్రదరిస్తూ ముందుకు సాగుతున్నారనుకోవచ్చు.
అయితే ఒకవేళ వైసీపీ మునిగిపోతే మంత్రులు, ఎమ్మెల్యేలలో చాలా మంది వేరే పార్టీలలోకి దూకేయడం ఖాయం. కానీ జగన్మోహన్ రెడ్డికి ఆ అవకాశం ఉండదు. కనుక కష్టమో… నష్టమో తాను ఎంచుకొన్న దారిలో ముళ్ళున్నా మొండిగా ముందుకు సాగుతుండాల్సిందే.



