ఉప రాష్ట్రపతి ఎన్నికలలో ఎన్డీయే అభ్యర్ధిగా పోటీ చేస్తున్న సీపీ రాధాకృష్ణన్కే వైసీపీ మద్దతు ఇస్తుందని ఆ పార్టీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ప్రకటించారు. నిజానికి వైసీపీకి వేరే దారి కూడా లేదు.
ఇండియా కూటమి అభ్యర్ధిగా పోటీ చేస్తున్న బి.సుదర్శన్ రెడ్డి తెలుగువారు. కనుక ఆయనకు వైసీపీ మద్దతు ఈయవచ్చు. కానీ ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలతో కత్తులు దూస్తూ, కాంగ్రెస్ అభ్యర్ధికి వైసీపీ మద్దతు ప్రకటించలేదు కదా?
అదీగాక బీజేపితో వైసీపీ ప్రత్యక్షంగా ఎటువంటి సంబంధం పెట్టుకోనప్పటికీ మోడీ, అమిత్ షాలకు జగన్ విధేయంగా ఉండక తప్పదు. లేకుంటే కేసులతో ఇబ్బంది తప్పదు.
మరీ ముఖ్యంగా మద్యం కుంభకోణం కేసులో జగన్ అరెస్ట్ అయ్యే అవకాశాలున్నాయి. కనుక ఇటువంటి అవకాశం లభించినప్పుడల్లా బీజేపి పెద్దలకు విధేయంగా ఉన్నామనే విషయం తెలియజేయడం చాలా అవసరం. ఇటువంటి చిన్న చిన్న సంకేతాలే జగన్ని జైలుకు వెళ్ళకుండా కాపాడుతుంటాయి. కనుక వైసీపీ ఈ అవకాశాన్ని వదులుకోలేదు.
అంటే వైసీపీకి వేరే గత్యంతరం లేనందునే ఎన్డీయే అభ్యర్ధి సీపీ రాధాకృష్ణన్కి మద్దతు ఇచ్చేందుకు సిద్దపడుతోందని చెప్పవచ్చు. జగన్కి ఈ కేసులు, అరెస్టుల భయమే లేకుంటే నేడు ఆయన రాజకీయ జీవితం మరో విధంగా సాగుతుండేది.
అలాగే రాష్ట్రంలో మైనార్టీ ఓటు బ్యాంక్ చేజారిపోకుండా కాపాడుకోవాలనే ఆలోచిస్తూ ధైర్యంగా బీజేపితో చేతులు కలపలేకపోయారు.
కనీసం చెల్లెలు షర్మిలతో రాజీ పడి కాంగ్రెస్ పంచన చేరినా జగన్ జీవితం, వైసీపీ భవిష్యత్ మరోలా ఉండేది. కానీ అదీ చేయలేకపోతున్నారు.
కనుక దేశంలో అత్యంత బలమైన ఎన్డీయే, ఇండియా కూటములతో ధైర్యంగా చేతులు కలపలేని జగన్ నిసహాయత వైసీపీకి, ఆయననే నమ్ముకున్న వైసీపీ నేతలకు, కార్యకర్తలకు అందరికీ శాపంగా మారిందని చెప్పవచ్చు.






