2019 ఎన్నికలలో 151 సీట్లతో రికార్డు గెలుపు అందుకున్న వైసీపీ తన చేతిలో అన్ని సీట్లు పెట్టుకుని కూడా తన ప్రభుత్వం ప్రకటించిన మూడు రాజధానుల అంశం మీద ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయింది.
అమరావతి నుండి రాజధానిని విశాఖ తీసుకువెళ్లాలి అనే జగన్ కల తన ప్రభుత్వ హయాంలో కూడా నెరవేర్చుకోలేకపోయారు. ఈ దసరాకు వెళతాను, ఆ సంక్రాంతికి వెళతాను, ఈ ఉగాదే ఫైనల్ అంటూ ఐదేళ్లు ఉన్న అన్ని పండుగలను తన విశాఖ పయనానికి వాడుకున్నప్పటికీ ఏ దేవుడు కరుణించలేదు, ఏ శుభ ముహూర్తం ముందుకు రాలేదు.
రాజధానిని విశాఖ తరలించాలనే ఉద్దేశంతో గత టీడీపీ ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు పెట్టి అమరావతిలో నిర్మించిన ప్రభుత్వ భవనాలను చెట్టుకు పుట్టకు వదిలి పెట్టి, తానూ నిర్ణయించుకున్న విశాఖలో ముఖ్యమంత్రిగా అడుగు పెట్టడానికి ఋషికొండకు గుండు కొట్టి మరి 500 కోట్లతో విలాసవంతమైన రాజ మందిరాలు నిర్మించుకున్నారు జగన్.
అయితే విశాఖ వెళ్లిపోవాలనే పిచ్చి ఆశతో అటు వేల కోట్ల ప్రజాధనంతో అమరావతిలో నిర్మించిన నిర్మాణాలను నిర్లక్ష్యం చేసారు. అవి కాదని మళ్ళీ కొన్ని వందల కోట్లు ఖర్చు చేసి విశాఖలోని ప్యాలస్ లు నిర్మించారు. ఇలా అమరావతిలో ఉండలేకపోయారు..విశాఖలో అడుగు పెట్టలేక పోయారు. అయితే అమరావతి నుండి విశాఖ ఎగిరిపోవాలని అనే కలను తన గెలుపుతో సాధించుకోలేక పోయినా ఓటమితో దక్కించుకున్నారు.
ముఖ్యమంత్రిగా అమరావతి నుండి విశాఖ 450 కిలోమీటర్లు ప్రయాణం చేయలేని జగన్ ప్రతిపక్షంలోకి రాగానే తాడేపల్లి నుంచి బెంగుళూరు 650 కిలోమీటర్లు ఎగిరిపోయారు. మళ్ళీ గెలిచి ముఖ్యమంత్రిగా విశాఖలోనే ప్రమాణస్వీకారం చేస్తాను అంటూ ప్రచారం చేసుకున్న జగన్ రుషికొండ మీద కాలు పెట్టి విశాఖను తన కాళ్ళ కింద ఉంచాలని ఆశ పడ్డారు.
అయితే ఇటు అమరావతి ప్రజలతో పాటు అటు విశాఖ వాసులు కూడా ఫ్యాన్ కు వ్యతిరేకంగా గుద్దిన బటన్ తో కనీసం తన సొంత నియోజకవర్గం పులివెందులలో కూడా ఉండలేని పరిస్థితికి దిగజారిపోయారు జగన్. అధికారంతో జగన్ కొండకు గుండు కొడితే ఓటు తో ఓటర్లు వైసీపీ కి క్షవరం చేసి కింద కూర్చోపెట్టారు.
చొక్కాలు మడత పేట్టే సమయం వచ్చింది అంటూ జగన్ పిలుపునిస్తే ఏకంగా పార్టీనే మడత పెట్టేసారు ఏపీ ప్రజానీకం. వారిని మడత పెట్టాలి, వీరిని మట్టి కరిపించాలి అని ఆవేశ పడిన వైసీపీ అహంకు 11 సీట్లతో కళ్లెం వేశారు ఓటర్లు. ఈ ఐదేళ్లల్లో వైసీపీ మడత పెట్టిన భూములను, అక్రమ సంపాదనను బయటపెట్టే పనిలో ఉంది కూటమి ప్రభుత్వం.




