లోక్ సభ స్పీకర్ వైకాపా ఎంపీల రాజీనామాలు ఆమోదించడంతో ఆ కథ మొత్తానికి సుఖాంతం అయ్యింది. అయితే తెలివిగా ఉపఎన్నికలు రాకుండా జాగ్రత్త పడ్డారు అనే నింద మాత్రం వారి మీద పడింది. ఈ వాదనను తెలుగు దేశం వారు విజయవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లగలిగారని విశ్లేషకులు భావిస్తున్నారు.
అయితే దీనిని కొట్టిపారేస్తున్నారు వైకాపా వారు. “తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ ఒకే టరమ్ లో రెండుసార్లు రాజీనామా చేసి రికార్డు సృష్టించారు.అలాగే ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించారు.వారి రాజీనామాలు వృధా పోలేదు, ప్రజలు వారిని విస్మరించలేదని చరిత్ర చెబుతుంది. అలాగే వైకాపా ఎంపీల త్యాగాలను ప్రజలు గుర్తిస్తారు,” అని వారు అభిప్రాయపడ్డారు.
అయితే కేసీఆర్ రాజీనామా చేసినప్పుడల్లా ధైర్యంగా మొండిగా ఉపఎన్నికలకు వెళ్లారు. ఒక్కోసారి ఓటమి చెందినా పోటీకి వెనుకాడలేదు. మరోపక్క వైఎస్సాఆర్ కాంగ్రెస్ ఎంపీలు తెలివిగా ఉపఎన్నికలు రాకుండా చూసుకుని రాజీనామాలు చేసారు. దీనితో తెరాసను గుర్తుపెట్టుకున్నట్టు జగన్ ఎంపీలను గుర్తు పెట్టుకుంటారా?



