గత నాలుగున్నరేళ్ళుగా టిడిపిని రాజకీయంగా బలహీనపరచడానికి వైసీపి ప్రభుత్వం చేయని ప్రయత్నం లేదు. ముందుగా ముఖ్య నేతల ఆర్ధికమూలాలను దెబ్బ తీసింది. తర్వాత టిడిపి నేతలు, కార్యకర్తలపై అక్రమకేసులు, పోలీసులతో వేధింపులు, చంద్రబాబు నాయుడుతో సహా టిడిపి నేతలు, కార్యకర్తలపై దాడులు, టిడిపి కార్యాలయాలపై దాడులు… ఒకటా రెండా చాలానే ఉన్నాయి.
అయినా వైసీపికి కక్ష తీరిన్నట్లు లేదు. దానిలో అభద్రతాభావం తగ్గలేదు. అందుకే చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయించి రాజమండ్రి జైలుకి పంపింది. ఆయన బయటకు వస్తే మళ్ళీ లోనికి పంపించడానికి వరుసపెట్టి అనేక కేసులు సిద్దం చేసింది.
ఆ తర్వాత జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, బండారు సత్యనారాయణ తదితరులను కూడా అరెస్ట్ చేసేందుకు సిద్దంగా ఉంది.
చంద్రబాబు నాయుడు జైల్లో, నారా లోకేశ్ ఢిల్లీలో ఉండటంతో టిడిపి ఇప్పుడు కాస్త బలహీనంగా ఉంది. కనుక ఇనుము వేడిగా ఉన్నప్పుడే దెబ్బ వేయాలన్నట్లు దానిని ఇప్పుడే గట్టిగా మరో దెబ్బవేసి టిడిపిని పూర్తిగా తుడిచిపెట్టేయాలని ప్రయత్నిస్తున్నట్లుంది. వైసీపిలో జగన్ తర్వాత రెండో స్థానంలో ఉన్న ఆ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన తాజా ట్వీట్ చూస్తే ఇది అర్దమవుతుంది.
“అధినాయకుడు కరప్షన్ కేసులో జైలుపాలైనా పార్టీ శ్రేణులు పెద్దగా పట్టించుకోకపోవడం టీడీపీ దయనీయ స్థితికి అద్దం పడుతోంది. త్వరలోనే ఆ పార్టీ రెండు మూడు ముక్కలుగా చీలిపోవచ్చు. 40 ఏళ్లుగా పార్టీకి మద్ధతిస్తున్న ‘బలమైన’ వ్యాపార వర్గంలో కూడా పునరాలోచన మొదలైంది. ఆయన దోపిడీలను తామెందుకు సమర్థించాలన్న ఆలోచనలో పడ్డారు,” అని విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు.
టిడిపిలో వ్యాపారాలు, కాంట్రాక్టులు, సినిమాలు చేసుకొంటున్నవారు చాలా మందే ఉన్నారు. కనుక వారిని నయన్నో భయాన్నో లొంగదీసుకొని పార్టీలో నుంచి బయటకు రప్పించి టిడిపిని నిలువునా రెండుగా చీల్చాలని వైసీపి కుట్ర పన్నుతునట్లు అనుమానం కలుగుతోంది. కనుక విజయసాయి రెడ్డి చేసిన ఈ ట్వీట్ని టిడిపి సీరియస్గా తీసుకొని జాగ్రత్తపడకపోతే ఆ తర్వాత ఆకులు పట్టుకొని ఏమీ ప్రయోజనం ఉండదు.



