వైసీపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే 2024లో జరుగబోయే ఎన్నికలలో గెలిచేందుకు ఏమేమి చేయాలో అవన్నీ చేయడం ప్రారంభించింది.
వాటిలో భాగంగానే వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ, ప్రతీ ఇంటిపై వాలంటీర్లతో నిఘా, సమాచార సేకరణ చేస్తోంది.
ఓట్లు వేస్తారనుకొనే లబ్ధిదారులకు సంక్షేమ పధకాల పేరుతో డబ్బు పంపిణీ, వేలకోట్లు ఖర్చు చేసి వాటి గురించి మీడియాలో ప్రచారం చేసుకొంటూనే ఉంది.
సచివాలయాలకు చివరికి కరెంటు స్తంభాలకు కూడా వైసీపి రంగులు వేయించింది. గడప గడపకు మంత్రులను, ఎమ్మెల్యేలను పంపించి ‘మీరు సంక్షేమ పధకాల తీసుకొంటున్నారని’ గుర్తు చేయిస్తోంది. వారితోనే ఇళ్లకు వైసీపి స్టిక్కర్లు అంటింప
ప్రతిపక్ష నేతల ఆర్ధిక మూలాలను, వారి ఇళ్ళు, పార్టీ కార్యాలయాలపై దాడులు చేయిస్తోంది. తిరిగి వారిపైన కార్యకర్తలపై కేసులు పెట్టించి పోలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిప్పుతూ వేధిస్తూనే ఉంది. ఇలా ఒకటేమిటి చెప్పుకొంటూ పోతే చాలా పెద్ద జాబితాయే ఉంది.
ఆ జాబితాలో చివరి అంశం చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం. ఇన్ని చేస్తున్నా ప్రజలు వైసీపికి ఓట్లు వేస్తారో లేదో అనుమానం ఇంకా పీడిస్తున్నట్లుంది. అందుకే ఇప్పుడు రాష్ట్రంలో లబ్ధిదారులందరి ఇళ్ళపై వైసీపి జెండాలు పెట్టించాలని నిర్ణయించిన్నట్లు తెలుస్తోంది. ఈ బాధ్యత సచివాలయాల ద్వారా వాలంటీర్లకు అప్పజెప్పబోతున్నట్లు తెలుస్తోంది.
తద్వారా వైసీపి ప్రభుత్వం ప్రజలకు, ప్రతిపక్షాలకు ఏమి సంకేతం ఇవ్వాలనుకొంటోంది? అని ఆలోచిస్తే, రాష్ట్రంలో లక్షల మంది సంక్షేమ పధకాల లబ్ధిదారులున్నారు. వారు కాక వైసీపి అభిమానులు లక్షల మంది ఉన్నారు. వైసీపి నేతలు, కార్యకర్తలు లక్షల మంది ఉన్నారు. కనుక వారందరి ఇళ్ళపై వైసీపి జెండాలు ఎగురవేసినట్లయితే, రాష్ట్రంలో ఎక్కడ చూసినా వైసీపి జెండాలే రెపరెపలాడుతుంటాయి. అప్పుడు ప్రజలు వాటిని చూస్తూ ఆ ప్రభావంతో మళ్ళీ వైసీపీకే ఓట్లు వేస్తారని భావిస్తుండవచ్చు.
వైసీపి జెండాలు ఎగురుతున్న ఇళ్ళన్నీ వైసీపి సొంతమని కనుక అటువైపు టిడిపి, జనసేనలు వెళ్ళరాదని హెచ్చరిస్తున్నట్లు కూడా భావించవచ్చు.
జెండాలు ఎగురవేయని ఇళ్ళన్నీ వైసీపిని వ్యతిరేకిస్తున్నట్లు మార్కింగ్ చేసినట్లవుతుంది. కనుక వారికి వేధింపులు మొదలవవచ్చు.
ప్రజలు చాలా భారీ మెజార్టీతో గెలిపించినప్పుడు వైసీపి వారి ఆకాంక్షలు అర్దం చేసుకొని, అమరావతి, పోలవరం నిర్మాణాలు వేగవంతం చేసి, సంక్షేమ పధకాలకు బదులు రాష్ట్రాభివృద్ధి, ఉద్యోగాల కల్పనపై దృష్టి పెట్టి ఉంటే నేడు ఇటువంటి పిచ్చి ఐడియాలు అవసరమే ఉండేది కాదు కదా?
ఇప్పటికే వైసీపి పోకడలతో వేసారిపోయున్న రాష్ట్ర ప్రజలు ఎన్నికలు ఎప్పుడొస్తాయా… వైసీపి జెండాని పీకెద్దామా?అని ఎదురుచూస్తున్నారు. ఇది గ్రహించకుండా ప్రతీ ఇంటిపై వైసీపి జెండాలు ఎగురేసేందుకు వైసీపి సిద్దమవుతోంది.
ప్రతీ ఇంటిపై పార్టీ జెండాలు ఎగురవేయిస్తే ప్రజలు తప్పకుండా ఆ పార్టీకే ఓట్లు వేస్తారనుకొంటే, దేశంలో అన్ని రాష్ట్రాలలో అన్ని పార్టీలు ఇదే పనిచేసేవిగా?వైసీపిని గెలిపించేందుకు వందల కోట్లు ఫీజు వసూలు చేస్తూ ఐప్యాక్, ప్రజల నాడి తెలుసుకొని తదనుగుణమైన సూచనలు, సలహాలు ఇవ్వకుండా ఇలాంటి పిచ్చిపిచ్చి ఐడియాలు ఇస్తుండటం చూస్తే శల్యసారధ్యం చేస్తున్నట్లే అనిపిస్తోంది.



