ఎన్నికలు దగ్గర పడుతుండటంతో టికెట్ల కోసం వైసీపీ నేతల ఆరాటాలు, పోరాటాలు జోరుగా సాగుతున్నాయి. బాలినేని ఎపిసోడ్ సుఖాంతం అయ్యిందనుకొంటే పిల్లి సుభాష్ చంద్రబోస్ ఎపిసోడ్ మొదలైంది. దానినీ తాత్కాలికంగా దుప్పటి కప్పి దాచేస్తే, మళ్ళీ బాలినేని కొత్త ఎపిసోడ్ మొదలుపెట్టారు.
బాలినేని శ్రీనివాస రెడ్డికి మొదట నెల్లూరు, తిరుపతి, కడప, ప్రకాశం జిల్లాలకు వైసీపీ రీజియనల్ కో-ఆర్డినేటర్గా జగన్ నియమించారు. అప్పుడు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తన వెనక గోతులు తవ్వుతున్నారని ఆరోపిస్తూ అలిగి ఆ పదవిని వదులుకొన్నారు. దాంతో విజయసాయి రెడ్డికి ఆ బాధ్యతలు అప్పగించారు. ఆ నాలుగు జిల్లాలతో పాటు పల్నాడు, బాపట్ల, నెల్లూరు, తిరుపతి, సూళ్లూరుపేట, గూడూరు, వెంకటగిరి, సర్వేపల్లి బాధ్యతలు కూడా విజయసాయి రెడ్డికే అప్పగించారు.
ప్రకాశం జిల్లా కూడా బాలినేని చేజారిపోవడంతో చాలా ఇబ్బందికరంగా మారింది. సొంత జిల్లాపై తనకు కాకుండా విజయసాయి రెడ్డి పెత్తనం చలాయిస్తుండటంతో, ఉమ్మడి ప్రకాశం జిల్లా బాధ్యతలు మళ్ళీ తనకే ఇవ్వాలని కోరేందుకు శుక్రవారం సాయంత్రం తాడేపల్లిలో జగన్తో భేటీ కానున్నారు.
అయితే ఓసారి విజయసాయి రెడ్డికి బాధ్యతలు అప్పగించిన తర్వాత మళ్ళీ ఆయన చేతిలో నుంచి కొన్ని జిల్లాలు వెనక్కు తీసుకొంటే అయన అలిగితే అది మరో ఎపిసోడ్ అవుతుంది. కనుక ఇద్దరిలో ఎవరికి సర్ధి చెపుతారో చూడాలి.
తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కూడా నిన్న తాడేపల్లికి వచ్చి జగన్ని కలిశారు. టీటీడీ బోర్డులో సభ్యుడుగా ఉన్న ఆయన ఇప్పుడు ఛైర్మన్ పదవి కావాలని కోరుకొంటున్నారు. ఆగస్ట్ 12తో టీటీడీ పాలకమండలి, దాంతోబాటే టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పదవీ కాలం ముగిసిపోనుంది. కనుక ఆ కుర్చీ తనకు ఇవ్వాలని భూమన కరుణాకర్ రెడ్డి కోరారు. అలాగే వచ్చే ఎన్నికలలో తనకు బదులు తన కుమారుడు పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు.
నగరి ఎమ్మెల్యే, మంత్రి రోజా కూడా ఈసారి టీటీడీ బోర్డు ఛైర్మన్ పదవికి పోటీ పడుతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రతీనెల బంధుమిత్ర సమేతంగా లేదా తన అనుచరులతో తిరుమల దర్శనానికి వచ్చినప్పుడల్లా, టీటీడీ అధికారులు ఆమెకు వివిఐపీ కోటాలో ప్రత్యేక దర్శనం చేయిస్తూనే ఉన్నారు.
కానీ తిరుమలలో రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు మందిమార్బలంతో ఆమెను లోనికి అనుమతించడం లేదు. కనుక దీనికి ఏకైక పరిష్కారం టిడిపి ఛైర్మన్ పదవి కనీసం పాలకమండలి, సలహామండలిలో సభ్యత్వం పొందడమే అని ఆమె భావిస్తున్నట్లు తెలుస్తోంది. కనుక ఆమె కూడా తన అభ్యర్ధనను జగన్ చెవిలో వేసిన్నట్లు తెలుస్తోంది.
తాడేపల్లి గేట్లు తెరుచుకోవడం లేదు కానీ తెరుచుకొంటే లోనికి వెళ్ళేందుకు బయట ఇంకా చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఎవరి సమస్యలు వారివి… ఎవరి కోరికలు వారివి.



