వైసీపీ నేతలకు ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడటం ఎప్పుడో మరిచిపోయారు. ఒకవేళ పోరాడుదామన్నా బలమైన సమస్య ఏదీ కనబడటం లేదు.
కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు, ప్రాజెక్టులు వస్తున్నాయి. అమరావతి, పోలవరం పనులు కూడా మొదలవుతున్నాయి.
రాష్ట్రంలో మళ్ళీ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. పైగా ప్రస్తుతం దావోస్ సదస్సులో పాల్గొంటున్న సిఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ బృందం రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తీసుకువచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.
వైజాగ్ స్టీల్ ప్లాంట్తో ఇరుకున పెడదామంటే కేంద్రం రూ.11,440 కోట్లు నిధులు విడుదల చేయడంతో నోరు మూసుకోవలసి వచ్చింది.
పోనీ రోడ్ల గురించి మాట్లాడుదామంటే డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ పిఠాపురం మొదలు మారుమూల ఏజన్సీ ప్రాంతాలవరకు కలియ తిరిగేస్తూ రోడ్లు వేయిస్తున్నారు. మరోపక్క రాష్ట్ర వ్యాప్తంగా గుంతలు పడిన రోడ్లన్నీటికీ మరమత్తులు జరుగుతున్నాయి.
ఎన్నికల హామీల గురించి వైసీపీ నేతలు ఎంత గట్టిగా అడుగుతున్నా ప్రజలు కూడా పట్టించుకోవడం లేదు. కనుక వైసీపీ నేతలకు ఏ ప్రజాసమస్య గురించి మాట్లాడాలో తెలియడం లేదు.
కనుక నారా లోకేష్, పవన్ కళ్యాణ్ డెప్యూటీ సీఎం స్టోరీతో ఓ మూడు రోజులు కాలక్షేపం చేసేశారు. ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉన్నవారికి అన్నమయ్య జిల్లా రాయచోటి ఆస్పత్రిలో ఓ బాలికపై ల్యాబ్కు టెక్నీషియన్ అత్యాచారం చేసిన కేసు గురించి, అలాగే తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు ఓ మహిళపై దాడి చేసిన కేసు గురించి తెలిసింది.
వెంటనే వైసీపీ నేతలందరూ అక్కడ వాలిపోయి మాట్లాడాల్సిన నాలుగు ముక్కలు మాట్లాడేశారు. వారి సోషల్ మీడియా కూడా చంద్రబాబు నాయుడు పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని సర్టిఫై చేస్తూ పోస్టులు పెట్టేసింది. కనుక వైసీపీ నేతలు మళ్ళీ ఖాళీ అయిపోయారు.
జగన్ జనం మద్యకు వచ్చి ఉంటే ఏదో ఒకటి మాట్లాడుతుండేవారు. ఆయన ఇచ్చిన ఆ లైన్ పట్టుకొని వైసీపీ నేతలు కాలక్షేపం చేయగలిగేవారు. కానీ సంక్రాంతి తర్వాత జనం మద్యకు వస్తానని మదర్ ప్రామిస్ చేసిన జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళిపోయి కులాసాగా గడుపుతున్నారు.
ఇటు సిఎం చంద్రబాబు నాయుడు సహకరించక, అటు తమ అధినేత జగన్, ప్రజలు సహకరించకపోతే మేము ఎలా రాజకీయాలు చేసుకోవాలని వైసీపీ నేతలు బాధపడుతున్నారు. వారికి జగన్ ఓదార్పు ఇప్పుడు చాలా అవసరమనిపిస్తుంది.




