అక్రమాస్తుల కేసులలో జగన్, విజయసాయి రెడ్డిలు బెయిల్ మంజూరు… వివేకా హాత్య కేసులో వైసీపి ఎంపీ అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు… దళిత యువకుడు సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపి ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్పై విడుదల…
పోలింగ్ కేంద్రంలో, నియోజకవర్గంలో దాడుల కేసులో మాచర్ల వైసీపి మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి రామకృష్ణారెడ్డి బెయిల్పై విడుదల… అగ్రిగోల్డ్ భూవ్యవహారంలో మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ బెయిల్పై విడుదల…
ఇటువంటి వార్తలు విన్నప్పుడు దాడులు, హత్యలు, హత్యా ప్రయత్నాలు, భూకబ్జాలు ఏం చేసినా కొన్ని నెలలు జైల్లో ఉండి బయటకు వచ్చేయవచ్చని అర్దమవుతుంది.
కానీ కోడికత్తి కేసులో నిందితుడు శ్రీనివాస్ 5 ఏళ్ళు జైలులో మగ్గాల్సి వచ్చింది. చట్టం, న్యాయం అందరికీ సమానమే కదా?అంటే కొందరి విషయంలో అధిక సమానమనే కుళ్ళు జోక్ వినిపిస్తుంటుంది.
ఈ కేసులు, విచారణ, జైలు, బెయిలు కధ ఏవిదంగా ముగుస్తుందో వైసీపి నేతలందరికీ కొట్టిన పిండి గనుకనే ఎన్నికలలో ఓడిపోయినప్పటికీ ఇంతగా చెలరేగిపోతున్నారని అనుకోవచ్చు.
కనుక రేపు వల్లభనేని వంశీ కావచ్చు… కొడాలి నాని కావచ్చు లేదా జోగి రమేష్ కావచ్చు… ఎవరిపై ఎటువంటి కేసులు నమోదు చేసినా టిడిపి కూటమి ప్రభుత్వం ఇంతకు మించి ఏమీ చేయలేదని స్పష్టం అవుతోంది. అందుకే రాజకీయ నాయకులు అందరూ ఈ కేసులు, జైళ్ళకి భయపడబోమనే డైలాగ్ చెపుతున్నారని అనుకోవచ్చు.
కనుక జగన్ అనే పట్టువదలని విక్రమార్కుడు వైసీపి అనే భేతాళుడిని భుజాన్న వేసుకొని 2029 ఎన్నికలకు మళ్ళీ రాకుండా ఉండరు. వస్తే మరి ఈ లెక్కన టిడిపి, జనసేన, బీజేపీలు ఆయనని ఏవిదంగా ఎదుర్కోగలవు?అని అప్పుడే టిడిపి మద్దతుదారులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు కూడా. వాళ్ళకి ఏం చెప్తారు బాబుగారు?




