ఓటమి గొంతు నొక్కేసిందా.?

Alla Ramakrishna Reddy Anil Kumar Yadav

ఏ ఆటలో అయినా గెలుపోటములు అనేవి సర్వ సాధారణమైన అంశమే. మరీముఖ్యంగా రాజకీయాలలో ఈ గెలుపు, ఓటమి అనేది పగలు రాత్రి వంటిది. అయితే గెలిచినప్పుడు విర్రవీగిపోవడం, ఓడినప్పుడు ముఖం చాటేయడం అంటే అది ప్రజా తీర్పుని అగౌరవ పరచడమే అవుతుంది.

గత ఎన్నికలలో జనసేన అధినేత పవన్ కళ్యణ్ పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయారు. అయినా కూడా ప్రజా జీవితానికి దూరంగా ఉంటూ రాజకీయాలతో రాజీ పడలేదు. అలాగే టీడీపీ అథినేత నారా చంద్రబాబు నాయుడు కూడా తమ పార్టీ ఓటమితో కుంగిపోలేదు, తన అరెస్టుతో ముఖం చాటెయ్యలేదు.

ADVERTISEMENT

ఇద్దరు కూడా తమ ఓటములను, తమకు జరిగిన అవమానాలను ధైర్యంగా ఎదుర్కొన్నారు, తమ పార్టీని ముందుకు తీసుకెళ్లారు, తమ నాయకులను గెలిపించుకున్నారు. తిరిగి 164 సీట్లతో అధికారాన్ని అందుకున్నారు. అయితే 2024 ఎన్నికలలో ఓటమి బాట పట్టిన వైసీపీ మాత్రం తమ నాయకులను ప్రజలకు చేరువ చేయలేకపోతోంది.

గతంలో గడప గడపకు తిరిగిన నాయకులు ఇప్పుడు తమ ఇంటి గడప దాటలేని పరిస్థితులను ఎదుర్కొటుంటున్నారు. గెలిచిన 11 మంది ఎమ్మెల్యే లు అసెంబ్లీ కి రావడం లేదు, ఓడిపోయిన 164 మంది ఎమ్మెల్యే లు ప్రజా క్షేత్రంలో కనిపించడం లేదు. ఇలా ఓటమితో ప్రజా జీవితానికి దూరమైన వైసీపీ నేతల లిస్ట్ ఒక్కసారి చూద్దాం.

దీనిలో మరి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మంగళగిరి వైసీపీ మాజీ ఎమ్మెల్యే ‘ఆళ్ల రామకృష్ణా రెడ్డి’. ఈయన గారు చేసిన ఘనకార్యాలకు ఈయనకు ఆయనకు సొంత నియోజకవర్గంలోనే ‘కరకట్ట కమలహాసన్’ అనే మరో ముద్దు పేరు కూడా పెట్టారు. అయితే విష సర్పం ఎలా అయితే తన గుడ్లను తానే మింగేస్తుందో అలాగే ఆర్కే కూడా తన సొంత నియోజకవర్గ అభివృద్ధిని తానే అడ్డుకుంటూ కోర్టులెక్కేవాడు.

దాని ఫలితమే మంగళగిరిలో వైసీపీ భూస్థాపితం అయ్యింది. ఆర్కే రాజకీయ జీవితం కనుమరుగయ్యింది. ఇక మరో వైసీపీ సౌమ్యుడు గురించి చూస్తే, ‘విజయ సాయి రెడ్డి’…జగన్ అక్రమాస్తుల కేసులలోనే కాదు వైసీపీ పార్టీలో కూడా నెంబర్ 2 గా చక్రం తిప్పిన ఈ పెద్దాయన వైసీపీ ఓటమితో రాజకీయ కాలచక్రంతో పోరాడలేక రాజకీయాలకు గుడ్ బై చెప్పి వ్యవసాయం చేయడానికి సిద్ధమయ్యారు.

గత ఐదేళ్లు వైసీపీ విశాఖ ఎంపీ గా కొనసాగిన సాయి రెడ్డి విశాఖ లోని భూముల కబ్జాతో ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందారు. ఇక బూతుల మంత్రిగా గత ఐదేళ్లు ఏపీ పరువు తీసిన గుడివాడ వైసీపీ మాజీ ఎమ్మెల్యే మంచివాడు..కొడాలి నాని అడపాదడపా అధినేత పక్కన దర్శనమిస్తూ మా ఉద్యోగాలు పోయాయి..ఇక మాకు ఐదేళ్ల వరకు ప్రజలతో పనిలేదంటూ పక్కకు తప్పుకుంటున్నారు.

అలాగే గత వైసీపీ ప్రభుత్వంలో ‘నోటి’ పారుదల శాఖ మంత్రిగా ఖ్యాతి గడించిన సౌమ్యుడు మాజీ మంత్రి ‘అనిల్ కుమార్ యాదవ్’ వైసీపీ కి వచ్చిన ఓట్ల పర్శంట్, తన ఓటమికి కారణమైన అవినీతి పర్శంట్ లెక్కించుకుంటూ అజ్ఞాతంలో జీవిస్తున్నారు. జగన్ మీద స్వామి భక్తి చాటుకోవడానికి ఎంతకైనా దిగజారగలను, ఇంకెంతకైన బరి తెగించగలను అని నిరూపించిన అందగాడు ‘జోగి’ ఇప్పుడు కేసుల భయంతో నక్కినక్కి దాక్కుంటున్నాడు.

ఇలా వీరంతా కూడా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నోటికి అద్దు అదుపు లేకుండా రెచ్చిపోయి ఇప్పుడు తమ ఓటమితో పాటుగా పార్టీ ఓటమికి కూడా కారకులుగా మిగిలిపోయారు. చివరికి ప్రజలకు కనిపించకుండా, నియోజవర్గంలో ఆయన పేరు వినిపించకుండా తమ గొంతు తామే నొక్కుకున్నారు.

ఇక వాసి రెడ్డి పద్మ, బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ఆళ్ల నాని ఇలా అనేకమంది వైసీపీ ముఖ్య నేతలు వైసీపీ ఓటమితో వైసీపీ అనే విష వాయువు నుంచి తప్పించుకుని టీడీపీ, జనసేన లో చేరి ప్రస్తుతానికి స్తబ్దుగా ఉంటున్నారు. ఇలా నువ్వే మా నమ్మకం జగనన్నా, నువ్వే మా భవిష్యత్ జగనన్నా అంటూ జగన్ భజన చేసిన వైసీపీ నేతలంతా ఇప్పుడు జగన్ పేరు విన్నా, వైసీపీ ఊసు చెప్పినా ఉలిక్కిపడే పరిస్థితికి వచ్చారు.

ADVERTISEMENT
Latest Stories