ఒక ప్లాన్ ప్రకారమే ఉపఎన్నికలు రాకుండా చూసుకుని రాజీనామాలు చేశారు అనే విమర్శలు వైకాపాను ఇరుకున పెడుతున్నాయి. ఉపఎన్నికలు వేస్తే పోటీకి సిద్ధమే అని బయటకు చెప్పినా ఈ అపప్రధను తప్పించుకోవడానికి అనేక రకాలుగా ప్రయత్నిస్తున్నారు. దీని గురించి కొత్త అంశం తెరమీదకు తెచ్చారు.
మా రాజీనామాల ఆమోద తాత్సరం టీడీపీ బీజేపీతో లాలూచీకి నిదర్శనమని, పార్టీ ఫిరాయించిన ఎంపీలపై చర్యలు తీసుకోకపోవడమే ఇందుకు నిదర్శనం అని వారు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే టీడీపీ బీజేపీ పార్టీ నాయకులు ఒకరినొకరు తిట్టుకుంటున్నంత పని చేస్తున్నారు. ఇటువంటి సమయంలో ఇలాంటివి ప్రజలు నమ్మే ఆస్కారం చాలా తక్కువ.
రాజీనామా చేసిన వారిలో మేకపాటి రాజమోమన్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, వరప్రసాద్, మిదున్ రెడ్డి, అవినాశ్ రెడ్డిలు ఉన్నారు. ఉపఎన్నికలు వచ్చి అధికారంలో ఉండే సహజమైన అనుకూలతల వల్ల టీడీపీ గెలిస్తే మొదటికే మోసం వస్తుందని వైకాపా, బీజేపీ కూడా భావించాయని అందుకే వ్యూహాత్మకంగా ఉపఎన్నికలు రాకుండా జాగ్రత్త పడ్డారని ఆరోపణ.



