టీడీపి, కూటమి పార్టీలు, వాటి ప్రభుత్వం అదృష్టమో లేదా జగన్, వైసీపీ దురదృష్టమో కానీ వైసీపీ మళ్ళీ పాత ఆలోచనలు, పాత మాటలు, పాత విధానాలతోనే ముందుకు సాగుతోంది.
ఓటమి తర్వాత వైసీపీ నేతల కాళ్ళు చల్లబడినట్లు వ్యవహరించినప్పటికీ జగన్మోహన్ రెడ్డితో సహా పార్టీలో అందరూ మళ్ళీ పూర్తిగా ఫామ్లోకి వచ్చేశారు.
మరీ ముఖ్యంగా వైసీపీకి 11 సీట్లు దక్కించడంలో చాలా కీలకపాత్ర పోషించిన సజ్జల రామకృష్ణా రెడ్డి మళ్ళీ నంబర్:2 స్థానంలోకి వచ్చేశారు. రాష్ట్ర స్థాయిలో వైసీపీని సమన్వయం చేసే కీలక బాధ్యత ఆయనకే జగన్ అప్పగించారు.
కనుక వచ్చే ఎన్నికలలో కూడా ఎట్టి పరిస్థితులలో 11కి ఒక్క సీటు కూడా తగ్గకుండా ఎలా ముందుకు సాగాలో వైసీపీ నేతలకి ఆయన మార్గదర్శనం చేస్తున్నారు.
ఈరోజు ఆయన తాడేపల్లి ప్యాలస్లో వైసీపీ బీసీ రిజర్వేషన్స్ అనుబంధ విభాగాల సాధికార అధ్యక్షుల సమావేశం నిర్వహించి వారికి మార్గదర్శనం చేస్తున్నారు.
ప్రభుత్వ కార్యక్రమాలలో జనగణమన ఎలాగో, అలాగే ఈ సమావేశంలో ముందుగా జగన్ భక్తి గీతాలాపన, భజన కార్యక్రమం జరిగింది. దా
నిలో భాగంగా జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీసీలను ఏవిదంగా ఉద్దరించారో కధలు కధలుగా తన్మయత్వంతో చెప్పుకొని చప్పట్లు కొట్టుకున్నారు.
తర్వాత చంద్రబాబు నాయుడు వలన రాష్ట్ర్రానికి, ముఖ్యంగా బీసీలకు జరుగుతున్న అన్యాయాల గురించి చెప్పుకొని బాధపడ్డారు.
ముగింపులో రాష్ట్రంలో అన్ని సమస్యలు పరిష్కారం కావాలంటే, రాష్ట్రంలో మళ్ళీ ప్రజలందరికీ మేలు కలగాలంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవడం తప్పనిసరి అని ఏకగ్రీవ తీర్మానం ఆమోదించారు.
ఇది వైసీపీ ఏవిదంగా ముందుకు సాగుతోందో అర్ధం చేసుకునేందుకు చిన్న ఉదాహరణ. కనుక వైసీపీ పంధా మార్చుకోకుండా భజన, విమర్శ, తీర్మానంతో ముందుకు సాగుతున్నంత కాలం వైసీపీ 11 సీట్లు ఎక్కడికీ పోవు.
కనుక కూటమి పార్టీలు, ప్రభుత్వం కూడా నిశ్చింతగా ఉండొచ్చు. ఈవిదంగా అందరూ సుఖంగా ఉండటమే కదా… కావాల్సింది?




