వైసీపీ ఓకే ఒక్క విషయంపై పూర్తి స్పష్టతతో ఉంటుంది. అదే… వైసీపీ ఎలాగైనా అధికారంలోకి రావాలి.. జగన్ ముఖ్యమంత్రి కావాలి. మిగిలిన అంశాలపై వైసీపీ తీరు ఎప్పుడూ ఆస్పష్టంగానే ఉంటుంది.
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే బీజేపికి దూరంగా ఉంటూ, దానికి అవసరమైనప్పుడు పార్లమెంటులో మద్దతు ఇస్తుండేవారు. కానీ ఏపీలో వైసీపీ ఓడిపోయి, మోడీ, అమిత్ షాల సహాయ సహకారాలు పొందలేకపోతున్నప్పుడు, జగన్ ఢిల్లీ ధర్నాలో కాంగ్రెస్కు దగ్గరయ్యేందుకు ప్రయత్నించారు.
తద్వారా తనకు పక్కలో బల్లెంలా మారిన ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిలని వదిలించుకోవచ్చనే ఆలోచన ఉంది. అలాగే మోడీ ప్రభుత్వానికి తాము కాంగ్రెస్కి దగ్గరవుతున్నామని బలమైన సంకేతం పంపాలనుకున్నారు. కానీ జగన్ సంకేతాలను మోడీ, అమిత్ షా పట్టించుకోలేదు.
అలాగని కాంగ్రెస్తో చేతులు కలుపడానికి జగన్కు ధైర్యం చాలడం లేదు. ఆక్రమాస్తులు, వివేకా హత్య కేసుల భయంతో పాటు తాజాగా ఏపీలో ఎదురవుతున్న రాజకీయ ఇబ్బందులే ఇందుకు కారణమని అందరికీ తెలుసు. కనుక నిన్న లోక్సభలో జమిలి బిల్లుకి వైసీపీ అనుకూలంగా ఓట్లు వేసింది.
జమిలి ఎన్నికలు అసలు జరుగుతాయా లేదా?ఎప్పుడు జరుగుతాయనేది వైసీపీకి ముఖ్యం కాదు. ఈ వంకతో తాము బీజేపితోనే ఉన్నామని తెలియజేస్తూ మోడీ, అమిత్ షాల పట్ల జగన్ తన విధేయత చాటుకునే ప్రయత్నం చేశారని భావించవచ్చు.
అయితే టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ఇలాగే మోడీ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు కదా?అని సందేహం కలుగవచ్చు. నిజమే!
కానీ ఆయన బీజేపితోనే ఉన్నామని సంకేతం ఇస్తుండటమే కాకుండా ఎన్నికల ముందు ఆ పార్టీతో ధైర్యంగా పొత్తులు పెట్టుకున్నారు. కానీ జగన్ బీజేపితో పొత్తు పెట్టుకోవడానికి భయపడ్డారు. కారణాలు అందరికీ తెలుసు.
కనుక చంద్రబాబు నాయుడు అవసరమైనప్పుడు ధైర్యంగా అడుగు ముందుకు వేయగలరు కానీ జగన్ వేయలేరని మరోసారి స్పష్టమైంది. జగన్లోని ఈ భయం లేదా అస్పష్టత కారణంగా ఇటు బీజేపికి, అటు కాంగ్రెస్కు దూరంగా ఉండిపోక తప్పడం లేదు. కానీ మళ్ళీ అదే మోడీ, అమిత్ షాల చుట్టూ ప్రదక్షిణాలు చేయక తప్పడం లేదు… కేసీఆర్లాగ!




